Previous Page Next Page 
రామాయణము పేజి 42


                                   కుంభకర్ణుడు
    రావణుడు  'బుద్దిమంతుడునూ పరాక్రమశాలియూ అగు విభీషణుని - వాడేదియో చెప్పబోగా ఆగ్రహించి - లంకాపూరి నుండి వెడలగొట్టినాను! వాడు పోయి నా శత్రువగు ఆ రాముని ఆశ్రయించినాడు!... భీమబలుడునూ శూరశిఖామణియూ అగు పెద్దతమ్ముడు కుంభకర్ణుడు నెలల తరబడి నిద్రలో గడుపుచున్నాడు! వానిని మేల్కొలిపి 'ఈ విపత్సమయమున నాకు నీవు తోడ్పడుము' అని కోరెదను" అని నిశ్చయించుకొన్నాడు. పిమ్మట అతడు "నా అనుజుని నిద్ర నుండి లేపి తీసికొనిరండు" అని ఆదేశించి భటులను కుంభకర్ణుని శయనాగారమునకు పంపినాడు.


    వారు పర్వతమంత ఎత్తునూ అంత లావునూ కల కుంభకర్ణుని దేహమును ఈటెలతో పొడిచి నొవ్వజేసి మెలకువను రప్పించినారు; "ప్రభూ మిమ్ము తీసికొని రావలెనని దానవేంద్రుని ఆజ్ఞ ఐనది" అని విన్నవించినారు.
    కుంభకర్ణుడు గాఢమునూ దీర్ఘమునూ అగు సుషుప్తి దాపురించుటకు కారణము మున్ను వానికి కలిగిన ఒక వింత అభిప్రాయము. "నా పరాక్రమము భాసిల్లవలెనన్నచో నాకు దయాదాక్షిణ్యముల వంటి సాత్త్విక గుణములు ఉండరాదు. నేను బ్రహ్మదేవుని మెప్పించి 'నిర్దయ'ను వరముగా కోరుకొందును" అని వాడు తపమును ప్రారంభించినాడు. వాని సంకల్పమును ముందే తెలిసికొన్న కమలాసనుడు సరస్వతిని "దేవీ వీని నాలుక మీద నిలిచి ఈ క్రూరుడడుగ దలచిన 'నిర్దయ'ను వేరొండు విధముగ పలికించి ప్రాణికోటికి హాని కలుగకుండ చూడుము" అని ఆదేశించినాడు. పిమ్మట విరించి (బ్రహ్మదేవుడు) కుంభకర్ణునకు ప్రత్యక్షమై 'వరము నడుగు'ము అన్నాడు. వాణి 'నిర్దయ'ను 'నిద్ర'గా మార్చి అడిగించినది. దాత (బ్రహ్మదేవుడు) "తథాస్తు" అని అంతర్హితుడైనాడు... అవక్ర పరాక్రముడగు కుంభకర్ణుని జీవితములో అధిక భాగము నిద్రలో గడచిపోయినది.
    కుంభకర్ణుడు రావణుని భటుల వెంటపోయి దానవేంద్రుడు చూపిన ఆసనము నధిష్టించి "అగ్రజా నన్నేల రప్పించితివి?" అని అడిగినాడు.
    రావణుడు: ఆ రాముడు ప్రక్కలో బల్లెము వలె వేధించుచున్నాడు!
    కుంభకర్ణుడు: నీవు సీతను అపహరించి తెచ్చితివి. అటు కాకుండ నీవు ముందుగనె తేవలసినది. అప్పుడామె నీ పరాక్రమమును మెచ్చుకొని నిన్ను వరించియుండెడిది.
    రావణుడు: (చిరాకుగా) నేనిపుడు నిన్ను నీ విమర్శలు వినుటకు రప్పించలేదు. గడచిన రెండు దినములందును జరిగిన సంగ్రామములోనే నేనేమియూ సాధించలేకపోయినాను. వానర సేన చెక్కుచెదరకయున్నది. మన సైన్యము తరిగిపోవుచున్నది. ప్రస్తుత కర్తవ్యమును నిశ్చయించుకొనుటలో తోడ్పడుదువని తోచి నిన్ను రప్పించినాను.
    కుంభకర్ణుడు: అగ్రజా నీవు దిగులు చెందకుము. నేనిప్పుడు రణరంగమునకు పోయి రామలక్ష్మణులను సమరమున నెదుర్కొని సంహరించెదను. అదియే మన కర్తవ్యము.

    అతడుత్సాహముతో లేచినాడు. రావణుని మేను పొంగినది. ఆనంద మాతని దశ వదనములను వికసింపజేసినది. అతడు సంతోషముతో "తమ్ముడా, నిన్ను అనుజునిగా పొందగలిగిన నేను మిక్కిలి అదృష్టవంతుడను! నీకు విజయము కలుగుగాక! అనతికాలముననె ఆ యన్నదమ్ముల శిరములను దెచ్చి నాకు చూపుము" అని చెప్పి కౌగిలించి వీడ్కొలిపినాడు.
    పర్వతాకారుడగు కుంభకర్ణుని చూచి వానరులు భయకంపితులైనారు. ఆహారము లేకుండ నెలల తరబడి నిద్రించి మేల్కొనిన కుంభకర్ణుని ఆకలి బాధించసాగినది. అతడు రణమును ఉపేక్షించి చేటలకన్న విశాలముగా నున్న తన చేతులతో అందిన వానరులను పట్టుకొని మ్రింగుట ప్రారంభించినాడు! ప్రాణభీతితో చెల్లాచెదురుగ పరుగిడుచున్న వానరులను శ్రీరాముడు వీక్షించి ఇంద్రాస్త్రముతో కుంభకర్ణుని కుడి భుజమును నరికినాడు. కుంభకర్ణుడు వామహస్తముతో వనచరులను పట్టుకొని భక్షించుచుండగా రాఘవుడా హస్తమును కూడ ఇంద్రాస్త్రముతో ఖండించినాడు. రావణానుజుడు ఆగ్రహముతో రాముని సమీపించి గుహ వంటి తన నోరును తెరచి కబళించబోయినాడు. రాముడు నిశితములగు రెండు శిలీ ముఖములను ఒకదానివెంట నొకటి ప్రయోగించి దానవుని చరణయుగళమును ఛేదించినాడు. వజ్రాయుధము దెబ్బకు పడిపోయిన పర్వతము వలె పర్వతాకారుడు కుంభకర్ణుడు నేలగూలినాడు.
    కుంభకర్ణుడు: రామా, నేను నా అగ్రజుడు రావణునకొక వాగ్దానమును చేసినాను. 'నేడు సమరమున రామలక్ష్మణులను సంహరించి నీకు చింతను బాపెదను' అని చెప్పినాను. నా కరచరణములను ఖండించి సమరమునకు అవకాశము లేకుండ చేసినావు!
    శ్రీరాముడు: రామలక్ష్మణులను సంహరించుట నీ తరము (నీకు శక్యము) కాదు. రణభూమిని ప్రవేశించిన వాడవు వెంటనే మాతో తలపడక మా వానరులను భక్షించసాగినావు. వారిని రక్షించుటకు నిన్ను శిక్షించవలసి వచ్చినది.
    కుంభకర్ణుడు: నా గాయముల నుండి రక్తము జలపాతముల వలె పడుచున్నది. యాతనను భరించలేకపోవుచున్నాను.
    శ్రీరాముడు: ఇప్పుడింద్రాస్త్రముతో నీ మొండెము నుండి శిరమును ఖండించెదను. నీ ప్రాణములతో పాటు యాతనయూ పోవును. నేను నీకిప్పుడు చేయగల ఉపకారమిదియె.
    శిరఃఖండనము జరిగినది. కుంభకర్ణుని వ్యర్ధ జీవితము ముగిసినది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS