దోపీడీలు,దొమ్మీలు సర్వ సాధారణమైపోయాయి. అయినా ప్రభుత్వ యంత్రాగానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు"
చాలా ఎమోషనల్ గా ఫీలయి చెప్పడం వలనేమో క్షణం ఆగి ఊపిరి పీల్చుకుంది ధీరజ.
"సీ మిస్ ధీరజా.... నీ బాధ నాకర్ధం అయింది. రాజకీయాలకూ గవర్నర్ కూ ఎంతో వ్యత్యాసముంది. నేడు భ్రష్టుపట్టిన రాజకీయాల్లోకి గవర్నర్ పదవిని ఈడ్చి తమ అమోఘమైన వాక్చాతుర్యంతో, రాజకీయపుటెత్తులతో తమ పబ్బం గడుపుకోవాలని చూసే రాజకీయ నాయకులకు ఈ పదవి ఎంతటి ఉన్నతమైనదో తెలియక పోవడం శోచనీయం..."
"కావచ్చు గవర్నర్ గారూ... కానీ రాష్ట్రంలో జరిగే అన్యాయాలను, అరాచాకలాను అక్రమాలను చూస్తూ మౌనంగా వుంటారా?" సీరియస్ గా ప్రశిమ్చిందామె.
"ప్రజలకు, ప్రభుత్వ ఆస్థులకు హాని జరగకుండా ఎటువంటి ఉద్యమాలు తలెత్తినా ఫరవాలేదు.
ఒకవేళ శృతిమించితే మితిమీరిన అందోళనను అణచివేయడానికి హోంశాఖ వుంది" ఎంతో సౌమ్యంగా చెప్పింది గవర్నర్.
ముక్తసరిగా వున్న ఆ జవాబులోని అంతరార్దాన్ని గ్రహించింది ధీరజ.
"రాష్ట్రంలో జరుగుతున్నది ఉద్యమంకాదు మేడమ్__ అరాచక శక్తుల ఆగడాలు అని పత్రికలన్నీ ఘోషిస్తున్నాయి"
"నిజానిజాలు మాకన్నా మీకే ఖచ్చితంగా తెలుస్తాయి" నిజాన్ని నిర్బయంగా ఒప్పుకుంది గవర్నర్.
"అవును మేడమ్..... ముఖ్యమంత్రిని దింపటానికి దశలవారీగా చేస్తున్న కుట్రే నేటి అశాంతికి కారణం....
ఈ అల్లర్లను సృష్టించి స్వప్రయోజనం పొందాలని చూస్తున్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు... వాళ్ళపై మీరు ఏమైనా చర్యలు తీసుకోగలరా?"
ధీరజ సూటిగా ప్రశ్నించింది.
"తప్పకుండా.... కాకపోతే తగిన సాక్ష్యాధారాలను చూసినప్పుడు మాత్రమే నేను తగిన చర్యను తీసుకోగలను"
"ఓ.కే మేడమ్! అ సాక్ష్యాలను మీ ముందుంచుతాను"
ధీరజా.... చట్టానికి ఎవరూ అతీతులు కాదు. ప్రభుత్వ అధికారులలో కానే, పాలకపక్షంలో వారినిగానీ ఎవరయినా సరే నేరం చేసిన వాళ్ళను రాజ్యంగం శిక్షించకుండా వదలదు"
రాజకీయ హత్య జరిగిన నాటినుంచి మారిపోయిన పరిస్థితులు_ నిరపరాధి అయిన రవితేజ అరెస్ట్ కాబడిన విధానం.... ముఖ్యమంత్రి వెనుక పనిచేస్తున్న బలమైన వర్గం సృష్టిస్తున్న అరచకాలను వివరణలతో విన్నవించింది జర్నలిస్టు ధీరజగవర్నర్ ఆమె చెప్పిందంతా సావదానంగా విన్నది.
"ఇన్ని నేరాలకు, ఘోరాలకు సూత్రదారిగా చెబుతున్న వ్యక్తి నిజంగానే వీటన్నింటిలో సంబంధాలు వున్నాయనే సాక్ష్యం చూపించినట్టయితే.... నా పరిధికి లోబడి నేను చేయగలిగింది నేను చేస్తాను ధీరజా"
అని హామీ ఇచ్చింది గవర్నర్.
థాంక్స్ చెప్పి బయలుదేరిందామె.
ధీరజ వెళ్ళిపోగానే గవర్నర్ పి.ఏ రిసీవర్ తీసి తనక్కావలసిన నంబర్ ను డయల్ చేశాడు.
* * * *
బెడ్ మీద వున్న సుధాకర్ ను చూస్తుంటే ధీరజ కడుపు తరుక్కు పోతుంది.
అతను కోమాలోకి వెళ్ళి నాలుగు రోజులయింది.
అతన్ని బతికించటం కోసం డాక్టర్లు అహర్నిశలూ శ్రమపడుతున్నారు.
ఇంకొక ఇరవయ్ నాలుగు గంటల్లో అతను స్పృహలోకి వస్తే తిరిగి పునర్జన్మ ఎత్తినట్టే.
అలా కాకుంటే శాశ్వితంగా అతను కన్నుమూస్తాడు.
డాక్టర్లు ఆ విషయం చెప్పడంతో ఆమె కనులవెంట కన్నీరు జాలువారింది.
తనవలన అతను బలయిపోతున్నాడన్నభావన ఆమెను కుంగ దీస్తుంది.
తన ఇల్లు ధ్వంసం చేయడమే కాకుండా తనను, తన స్నేహితుడిని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళను వదలకూడదనే నిర్ణయం తీసుకున్నది.
ఆమె హృదయం ప్రతీకారజ్వాలతో మండిపోతుంది.
అందుకే గవర్నర్ ను కలసింది.
ఆమెతో సాక్ష్యాలు తీసుకువస్తానని చెప్పింది కానీ, నిజానికి తన వద్ద ఎలాంటి సాక్షాలు లేవు_ మనసాక్షి తప్ప!
ఉన్న ఫోటోలు జయచంద్ర మనుషులు పట్టుకుపోయారు.
వాటిని గవర్నర్ చూడగలిగితే జయచంద్ర కుతత్రం అర్ధమౌతుంది.
ప్రజాస్వామ్యంగా ఎన్నికలు కవటానికి బదులు అక్రమ మార్గాన పదవిని చేపట్టాలని ప్రయత్నిస్తున్న అతని చరిత్ర తిరగపడుతుంది.
