దారుణంగా ఓడిస్తోందామె. చాలా స్వల్ప పరిచయంలో చిన్న చనువు తీసుకుని ఒంటరిగా వుంటున్న ఓ అమ్మాయిపైన సానుభూతి చూపాలని వచ్చాడు.
"మిస్టర్ ఆదిత్యా! ఓ ప్రశ్నకి జవాబు చెపుతారా?"
తల పైకెత్తి చూశాడు.
"ఆడవాళ్ళు వేసుకునే బ్రాసరీ పుట్టుక ఎలా జరిగిందో చెప్పగలరా?"
హఠాత్తుగా ఆ ప్రసక్తేమిటో అతనికి అర్ధంకాలేదు. ఆమె చూపులలో నిజాయితీయే తప్ప అపహాస్యంలేదు.
"ఫ్రెంచి దేశస్థుడు 'బ్రా'ని తొలిసారి కనిపెట్టింది తామే అంటే కాదు మేము అంటారు జర్మన్స్" చెప్పాడు.
"నిజంగా మొదలయింది మా దగ్గర అంటారు చైనా దేశస్థులు దానికో అందమైన కథని అల్లి ప్రపంచంపైకి వదిలిపెట్టారు."
"ఔను!
ఆ కథ చెప్పగలరా?"
"ఎనిమిదో శతాబ్ధంలో చైనా చక్రవర్తి హుయాన్ సంగ్ కి తన దర్భారులోని ఓ యువతితో అక్రమసంబంధం వుండేది. ఒకనాడు..." ఆగిపోయాడు బిడియంగా.
"ఉన్మాదిలా ఆ చక్రవర్తి తన పంతిని ఉపయోగించడంతో 'గాటు' కనిపించకుండా ఆ యువతి తన వక్షస్థలంపైన ఎర్రటి సిల్క్ రిబ్బను చుట్టుకుంది. అది మరింత ప్రొవోకెటిక్ గా కనిపించడంతో చైనా చక్రవర్తి అప్పట్నుంచీ తన కొలువులోని ప్రతీ యువతీ అలాగే అలంకరించుకోవాలని ఆదేశించాడు. అలంకరణ క్రమంగా కొలువుదాటి ప్రజల్లోకి పాకింది. ఇరువయ్యవ శతాబ్దంలో 1920 లో అమెరికన్ సోషలైట్ మేరీ జాకబ్ స్త్రీలు ధరించే బ్రాసరీల గురించి అధ్యయనం చేసి 'మదరాఫ్ ది మోడరన్ బ్రా'గా ఖ్యాతిని సంపాదించడమేగాక, ఆ పేటెంట్ ని వార్నర్ బ్రదర్స్ కోర్పేట్ కంపెనీకి పదిహేను వందల డాలర్స్ కి అమ్మింది. అలా అమెరికా యూరప్ దేశాల నుంచి ఈ 'బ్రా' అలంకరణ మిగతా ప్రపంచానికి విస్తరించింది...." క్షణం ఆగిందామె. "ఇదంతా ఎందుకు చెప్పానూ అంటే ప్రపంచంలో ప్రతి సంఘటనా పరిణామానికి కారణమయింది....నేనీరోజు బయటకు రావడమూ అంతే. కాకతాళీయంగా బ్రెస్ట్ పైన ఏర్పడిన చిన్న గాయం ఈరోజు ప్రపంచంలో వేలకోట్ల డాలర్ల 'బ్రా'ల వ్యాపారానికి నాంది పలికినట్లే నా మనసుకయిన చిన్న గాయం బాబాయ్ తో నాకున్న రెండు దశాబ్దాల బంధాన్ని తెంచుకోడానికి కారణమైంది."
జవాబు చెప్పలేదు ఆదిత్య బయట చీకటిలోకి చూస్తున్నాడు.
"ఈ విషయం చెప్పడానికి 'బ్రా'ల వర్ణింపులని ఎందుకు చెప్పానని మీరు ఆలోచిస్తున్నారు కదూ?"
ఉలిక్కిపడ్డాడు నిజమే! సైర్గ్గా ఆ విషయమే తను ఆలోచిస్తున్నాడు.
"ఎందుకంటే ఆ ఉదాహరణ నుంచి మీరు టాపిక్ ఎంతదాకా పొడిగించగలరో చెక్ చేద్దామనుకున్నాను కాని మీరు నిశ్శబ్దంగా నిలబడిపోయి మీరు అందరిలాంటి అబ్బాయి కాదని నిరూపించుకున్నారు."
ఎక్కడినుంచో ప్రసక్తిని ప్రారంభించి మరెక్కడికో సాగిపోతున్న ప్రణయ విశ్లేషణ అతడికెంత కంగారుపుట్టించిందీ అంటే వెంటనే అన్నాడు- "నేను వచ్చింది మరో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలని కూడా."
"ఏమిటది?"
"మన రాష్ట్రంలోని యూనివర్శిటీల మధ్య ఐక్యూ టెస్ట్ కండక్ట్ చేద్దామనుకున్న సిల్వర్ స్పాట్ కంపెనీ పోటీలను నిరవధికంగా వాయిదా వేసింది."
హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది.
చాలాసేపు తర్వాత అన్నాడు- "ఇలాంటి గ్యారంటీలేని ఓ పోటీ కోసం మీరు మీ బాబాయ్ తో పేచీపడి బయటకు వచ్చారు."
"అయినా అర్ధం చేసుకునే అవకాశం చిక్కిందిగా!"
"ఏమిటి?"
"మా బాబాయ్ ఏమిటో అన్న విషయం ఒక్కటే కాదు, నా కంపెనీలో మీరెలా రియాక్టవుతారో అన్న సత్యం కూడా."
"మరి వెళ్ళిరానా?"
"ఉంటానన్నా నాకు అభ్యంతరంలేదు" భావరహితంగా అంది. "ఐ లైక్ యువర్ కంపెనీ మిష్టర్ ఆదిత్యా!"
"థాంక్యూ! మళ్ళీ కలుస్తాను." కలలోలా బయటకు నడిచాడు.
అతన్ని పట్టించుకోలేదు ప్రణయ. సిల్వర్ స్పాట్ కంపెనీ ఐక్యూ టెస్టుని నిరవధికంగా వాయిదా వేయడం గురించి ఆలోచిస్తోంది.
ఆమె తండ్రి చంద్రశేఖరరావు రెండు రోజులక్రితం ఫోనులో చెప్పాడు "చీఫ్ మినిష్టర్ కేవలం ప్రబంధ గెలుపుకోసం ఏర్పాటుచేసే పోటీ అది' అని అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ఎందుకిలా జరిగింది? ఇందులో మరేదన్నా మెలిక వుందా?
ఆమె అంచనా తప్పుకాలేదు.
యూనివర్సిటీ స్థాయిలో మొదలయిన ఓ చిన్నపోరాటం రాష్ట్రస్థాయి రాజకీయ సమస్యకి కారణమయిందన్న సత్యానికి సాక్ష్యం, ఆ రాత్రి భాగ్యనగరంలోని ఓ మంత్రివర్యుడి భవంతిలో జరుగుతున్న చర్చ.
* * *
హైదరాబాద్ లో రాత్రి ఎనిమిది గంటలకు....
హోమ్ మినిస్టర్ పద్మనాభం, అతడికి చాలా ఆత్మీయులయిన ముగ్గురు ఎమ్మెల్యేలతో తన ఇంటిలోకి రహస్య సమాలోచనా మందిరంలో ఆసీనుడై వున్నాడు.
"ముఖ్యమంత్రి సిల్వర్ స్పాట్ కంపెనీ చైర్మన్ తో మాట్లాడే అవకాశం లేదంటారా?" ఈ మధ్యనే మంత్రి పదవి కోల్పోయిన ఓ ఎమ్మెల్యే అడిగాడు పద్మనాభాన్ని చూస్తూ.
ఆ ఒక్కడే కాదు. అక్కడున్న మిగతా ఎమ్మెల్యేలిద్దరూ కొన్ని అభియోగాలపైన మంత్రిపదవులను కోల్పోయినవాళ్ళే అయినా తమ కన్నా వయసులో చాలా చిన్నవాడయిన హోం మినిస్టర్ పద్మనాభాన్ని ఆశ్రయించారు.
"అసలు ప్రబంధ పోటీలో నెగ్గింది కాబట్టి, ఆ పోస్ట్ పోన్ మెంట్ ని అంతగా పట్టించుకోడు. కాబట్టి సిల్వర్ స్పాట్ కంపెనీ చైర్మన్ తో మాట్లాడే ప్రసక్తిలేదు."
ముఖ్యమంత్రి మూలంగానే ముగ్గురూ పదవులు కోల్పోవడంతో వాసుదేవరావుపైన చాలా అక్కసుగా వున్న ఆ ముగ్గురూ చాలా పకడ్బందీగా అసమ్మతివర్గాన్ని కూడగట్టుకుంటున్నారు. నలభైయేళ్ళ పద్మనాభం గూండానే గాక, రాజకీయాల్లో సైతం నిష్ణాతుడే రేపో మాపో అవకాశం చూసుకుని ముఖ్యమంత్రి వాసుదేవరావు చాప కిందకి నీళ్ళు తేవాలని చాలా గట్టిగా ఆలోచిస్తున్నాడు తనే సి.ఎమ్. కావాలన్న ఆలోచనతో.
