Previous Page Next Page 
రామాయణము పేజి 18

                   

                     మునీశ్వర సందర్శనము
    సీతారామ లక్ష్మణులకు మున్యాశ్రమ సందర్శనయాత్ర అత్యంత ఆనంద ప్రదమైనది. ప్రతి ఆశ్రమము నందును దీర్ఘకాలము ఆగవలసి వచ్చుటచే వారు సుతీక్ష్ణని నివాసమునకు  తిరిగి వచ్చుటకు సుమారు పది సంవత్సరముల కాలము పట్టినది.
    విరాధుని సమాధికి ఒకటిన్నర యోజనముల దూరమున 'శరభంగుడు' అను మహర్షి ఆశ్రమము ఉన్నది. ఆ ముని పుంగవుడు అద్వితీయమూ అపూర్వమూ ఐన తన తపఃఫలముగ సత్యలోకమున స్దానమును ఆర్జించుకొన్నాడు. ఇంద్రుడు ఆయన ఆశ్రమము ప్రక్కనుండి పోవుచూ తన విమానమును ఆపి మునిని సందర్శించుటకు ఆయన కుటీరములోనికి పోయినాడు. కుశల ప్రశ్నల యనంతరము శక్రుడు తిరిగి పోవుచూ  శరభంగునితో "తపోదనా నీవు సత్యలోకమును చేరదలచినచో విమానమున నాతో రమ్ము. నిన్నక్కడ దింపి  పిమ్మట నేను అమరావతిని చేరుకొందును" అన్నాడు.
    శరభంగుడు: సంక్రందనా నీకు నా ధన్యవాదములు... ఈ అరణ్య మందలి సాధుజనమునకు  క్రూరదైత్యుడు విరాధుని పీడను తొలగించిన అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు సతితోనూ అనుజునితోనూ నా ఆశ్రమమునకు విచ్చేయుచున్నాడు. ఆ మహనీయుని దర్శనభాగ్యమును కలిగించుకొన్న పిమ్మట కాని నేను సత్యలోక వాసము మాట తలపెట్టను.
    సురేశ్వరుడు 'అట్లే చేయుము" అని చెప్పి     వెడలినాడు.
    సీతారామ లక్ష్మణులాశ్రమమును ప్రవేశించుచుండగా శరభంగుడెదురేగి స్వాగతమును పలికి ఆతిథ్యమిచ్చినాడు.
    శరభంగుడు: శ్రీ రామచంద్రా మీ రాక వలన  నా ఆశ్రమము పావనమైనది. నేను  మహొగ్రతపము వలన ఆర్జించిన పుణ్యమును నీకు సమర్పించెదను స్వీకరించుము.
    రాముడు: (స్పందించి) మునిసత్తమా, మీరు  చూపుచున్న ఆదరాభిమానములకు కృతజ్ఞుడను.... నా మనవిని ఆలకించుడు. మీరార్జించిన పుణ్యమును మీరేయనుభవించ వలెను. అది అటుంచుడు. నేను క్షత్రియుడను. ఇచ్చుటయే కాని పుచ్చుకొనుట క్షత్రియ ధర్మము కాదు.
    శరభంగుడు: శ్రీరామచంద్రా క్షత్రియుడుగా నీవు మాకివ్వవలసిన దోసంగినావు. ఈ అరణ్యమున కేతెంచి నీవిచ్చటి ముని సందోహమునకు రాక్షసుల వలన భమును తొలగించినావు. ఈ  అభయ ప్రదానము నీ క్షత్రియధర్మమును నెరవేర్చుచున్నది.
    పిమ్మట సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణడను మహర్షి ఆశ్రమమునకు పోయినారు.
    రాముడు: మహాత్మా మేము వర్ణశాలను నిర్మించుకొనుటకు అనువగు స్దలమును తెలుపుడు.
     సుతీక్ష్ణుడు: మొదట మీరీ యరణ్యమున వివిధ ప్రాంతములందు కల మహర్షుల ఆశ్రమములను  చూచిరండు. అటు చేయుట వలన మీకీ విశాలాటవితో పరిచయము కలుగుటయే కాక అయా ఆశ్రమవాసులెల్లరకునూ మీ దర్శన భాగ్యము కలిగి తమ కష్టములను  మీకు తెలుపుకొనుటకు అవకాశము లభించును. పిమ్మట మీరు వర్ణశాలను నిర్మించుకొని స్ధిరపడవచ్చును.
    రామునకు సుతీక్ష్ణుని హిత వాక్యములు నచ్చినవి. మరునాడు వారు మువ్వురునూ మున్యాశ్రమ సందర్శన యాత్రకు బయలుదేరినారు. ప్రతి ఆశ్రమము నందునూ వారికి శ్రద్దాసక్తులతో కూడిన ఆదరణ లభించెడిది. ఆశ్రమవాసులు వారిని కుటుంబ  సభ్యులుగ పరిగణించుచు పరిసరము లందరి  దర్శనీయ స్దలములను చూపించెడివారు. దైత్యుల వలన  కలుగుచున్న అపచారములను విన్నవించుచు శరణుజొచ్చెడివారు. 'పోయి వచ్చేదము' అని వీడుకోలును కోరగా 'వలదు, ఇది మీ  ఆశ్రమమేయని భావించి ఇచ్చటనివసించుడు' అని  మాసముల  తరబడి ఆపివేసెవారు.
    సీతారామ లక్ష్మణులకు మున్యాశ్రమ సందర్శన యాత్ర అత్యంత ఆనంద ప్రదమైనది. ప్రతి  ఆశ్రమము నందును దీర్ఘకాలము ఆగవలసి వచ్చుటచే వారు  సుతీక్ష్ణుని నివాసమునకు  తిరిగి వచ్చుటకు సుమారు పది సంవత్సరముల కాలము పట్టినది.
     సుతీక్ష్ణుడు: శ్రీరామచంద్రా నా కోరికపై నా ఆశ్రమమునకు తిరిగివచ్చి పునర్దర్శన భాగ్యమును కలిగించిన మీకు నా కృతజ్ఞతలు. మీరు తప్పక దర్శించవలసిన ఆశ్రమమొకటి మిగిలియున్నది. అది అగస్త్య  మహర్షి ఆశ్రమము. ఆయన మహా మహిమాన్వితుడు. సముద్ర మందలి జలమునంతనూ గ్రుక్కెడుగా మ్రింగినాడు. హిమవంతునితో పోటీపడి ఆకాశము వరకును ఎదిగిపోయి సూర్యగమనకు అవరోధము కలిగించిన వింధ్య పర్వతమును అణగద్రొక్కి లోకమునకు మేలుచేసినవాడు. అధికార మదముతో తన్నవమానించిన నహుషుని "కొండచిలువగా  మారిపొమ్ము!" అని శపించిన వాడు....అరణ్యములో  ఈ ప్రాంతముననే 'ఇల్వలుడు', 'వాతాపి' అను అన్నదమ్ములు అసురులుండెడువారు. వారు మునులను కపటోపాయమున చంపి  భక్షించెడివారు; ఇల్వలుడు బ్రహ్మణ వేషమున పోయి సంస్కృత భాషలో 'నేడు మా యింట ఆబ్ధకము. మీరు భోక్తలుగా రావలెను' అని కనపడిన విప్రులను నమ్మించి తీసికొని వచ్చెడువాడు.  పిమ్మట వాతాపి ఒక మేకగా మారెడివాడు. ఇల్వలుడు ఆ మేష మాంసమును వండి వడ్డించెడివాడు.  భోక్తలు ఆరగించి భుక్తాయాసమును తీర్చుకొనుచుండగా ఇల్వలుడు వాతాపీ ఇంక బయటకు రమ్ము" అని పిలిచెడివాడు. భోక్తల ఉదరములలో మాంస రూపమున ఉన్న  వాతాపి ఇల్వలుని పిలుపును వినుటతోనే మరల రక్కసుడుగా మారి భోక్తల పొట్టలను చీల్చి వెలికి  వచ్చెడివాడు. ఆవిధముగా ఆ అసురులిర్వురునూ ఎందరి అసువులనో తీసినారు... ఆ సంగతిని విన్న అగస్త్యుడు ఇల్వలుడు భోక్తలకై నిరీక్షించుచున్న  చోటునకు పోయి వానిచే ఆహ్వానించబడిన వాతాపిని అరగించినాడు. ఇల్వలుడు యథాప్రకారము "వాతాపి జీర్ణం; తినుటతోనే వానిని జీర్ణము చేసి కొన్నాను!" అన్నాడు. ఇల్వలుడోగ్రహముతో అగస్త్యుని సమీపించు చుండగా  ఆ తపోనిధి తన చూపుతో వానిని  భస్మము చేసినాడు!... అగస్త్యుని మహాత్త్యము అద్వితీయము.
    సీతారామ లక్ష్మణులు  సుతీక్ష్ణుని ఆశ్రమమున కొన్ని రోజులుండి పిమ్మట అగస్త్యాశ్రమమునకు పోయినారు. అగస్త్యుడు శిష్య సమేతముగా ఎదురువచ్చి లోనికి తీసికొనిపోయి అతిథి సత్కారాములను చేసి పిమ్మట "రామా విశ్వకర్మ నిర్మించిన దివ్యధనువు ఒకటీ, దేవేంద్రుడిచ్చిన అక్షయ సాయక తూణీరాములు రెండూ, బంగారుపిడి గల ఖడ్గమూ నీ కొరకు భద్రముగా ఉంచినాను. విశ్వామిత్రుడు నీకిచ్చిన అస్త్ర శస్త్రములతోపాటు ఇవియూ నీకు దుష్టులను శిక్షించుటకు ఉపయుక్త ములగును" అని చెప్పి వాటిని రామునకోసంగినాడు.
    రాముడు: మునినత్తమా, తమకు నా ధన్యవాదములు... మా వనవాస కాలమింకనూ నాలుగు వత్సరములున్నది. వాసయోగ్యమగు స్దలమును సూచించగోరుచున్నాను. అందు వర్ణశాలను నిర్మించుకొందుము.
    అగస్త్యుడు: గోదావరినది ప్రవహించు ప్రాంతమున 'పంచవటి' యను వనమున్నది. అందు మీ వర్ణశాలను నిర్మించుకొనుడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS