నీతులు నియమాలు తాపత్రయాల కత్తుల బోనులో
నిలిచి నిలిచి తిరిగే ఎలుగుబంటివంటి మనం
డేగలాంటి ఆ చూపుని ఆ వుసురుని ఆ ఎత్తుని
మబ్బులాంటి ఆ పొగరుని మైకాన్ని స్వర్గ సామీప్యాన్ని
తిరిగి పొందలేమన్న సంగతి నాకు తెలుసు
కాని
నేటి హేమంత శైత్యానికి గడ్డకట్టుకున్న నా వెనుక
నాటి వాసంత విహారాల జాడలున్నవన్న తృప్తి
మాత్రం మిగిలి
ఒక్క జీవకణమైనా రగిలి
శాంతిని పొందుతుంది నా మనస్సు
నా భావి తరానికి పిలుస్తుంది
పవిత్రమైన వీని ఆశీస్సు
* * *
---1955
కవి వాక్కు
భారతదేశాన్ని కాదనలేను
రష్యాదేశాన్ని కొలువలేను
నిజం ఎక్కడో అక్కడ నా ప్రాణం వుంది.
హృదయం ఎక్కడో అక్కడ ఉదయం ఉంది
పులిచంపిన లేడి నెత్తురు పులుముకోలేను
ఖడ్గ మృగోదగ్ర విరావం ఆలకించలేను
జగద్ధాత్రి! నీ కుమారులమైన మేము
తత్త్వాలపేర విప్లవాలపేర ఒకరి నొకరం హతమార్చుకోలేము!
శాంతికోసం యుద్ధాన్ని ప్రజ్వలింప చేస్తారు
సుఖం కోసం ఆ రక్త విప్లవాన్ని తరింపచేస్తారు
శ్మశాన భూమిని వికసిస్తుంది మీరు నాటిన పూలచెట్టు
కాని ఎవరు తుడుస్తారు తల్లీ! నీ కన్నీటి బొట్టు?
ప్రభువులనే కిరాతకులకు అమ్మనన్నాడు బమ్మెర పోతన!
పార్టీలకు అమ్ముడుపోయిన నేటి కవులకు లేదు వేదన!
మాటల మేజిక్కు నమ్మి, పాటల మ్యూజిక్కు నీలో క్రమ్మి
మరచిపోకు అసలువాణ్ణి నీ సోదరుడైన మానవుణ్ణి
