Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 23

 

    * తెలుగు చలనచిత్ర పరిశ్రమను మన రాష్ట్రానికి తరలించాలన్నది చిరకాలవాంఛ. ఎంతో కృషి జరిగినా ఆశించిన ఫలితం యింతవరకు దక్కలేదు. ప్రజాభిమానాన్ని పొందగలిగిన నటునిగా, ఈ సముచితమైన రాయితీలతో చలనచిత్ర కళామతల్లి తన పుట్టింటికి తరలివచ్చి, నయనానందమై, శోభాయమానమై సకల కళాప్రపూర్ణయై మన తెలుగునాడుకు నిత్య నీరాజనాలందిస్తుందని నా నమ్మకం, విశ్వాసం, ఆకాంక్ష. ఇది నా కర్తవ్యం.

 

         


    విజయవాడలో 1984 మార్చి 23న దూరదర్శన్ కేంద్రానికి ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీతో.

           


    హైదరాబాదులో 1984 ఏప్రిల్ 2న తెలుగు విజ్ఞాన పీఠానికి డా|| నీలం సంజీవరెడ్డి ప్రారంభోత్సవంచేసే కార్యక్రమంలో

      


    1983 మార్చి 30న ఆంధ్రప్రదేశ్ వాణిజ్యమండలి 66వ వార్షికోత్సవంలో ప్రారంభోపన్యాసం.

            


    1984 ఏప్రిల్ 28న రాయలసీమ, తదితర ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన అఖిలపక్ష సమావేశంలో.

    ఇంతవరకు అమలులో వున్న సబ్సిడీ విధానానికి బదులుగా ప్రభుత్వపరంగా పరిశ్రమకు తగిన సాయం సకాలంలో అందజేయాలన్న దృష్టితో ఈ రాష్ట్రంలో__నెలకొల్పబడిన స్టూడియో, తదితర చలనచిత్రనిర్మాణ సంస్థలకు పని కల్పించాలన్న దృష్టితో కొత్త సహాయక విధానాన్ని రూపొందించడం జరిగింది. దీనివలన నిర్మాతలకు తక్కువ ధరతో కాల్ షీట్లు ఏరోజుకారోజు ప్రభుత్వ సహాయం అందాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇదిగాక చిత్ర నిర్మాణ ప్రమాణాలను హెచ్చుస్థాయికి తీసుకొని వెళ్లాలన్న దృష్టితో, మలి చిత్రం ఒక ఏడాది లోపుగా తిరిగి మొదలుపెట్టే నిర్మాతలకు గత చిత్రం నడిచిన తీరులో వారానికి 25 వేల రూపాయల చొప్పున లక్షకు మించకుండా ప్రోత్సాహక పెట్టుబడి విధానంలో ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తూ నెలకు రూ. 500 లకు తక్కువ ఆదాయం వున్న సాంకేతిక సిబ్బందికి ఉచితంగాను, ఆపైన వెయ్యి రూపాయలకు లోపు ఆదాయం వున్నవాళ్ళకి తక్కువ అద్దెకు గృహవసతి కల్పించబడుతుంది. 
    నిర్మాణానికి కావలసిన అన్నిరకాల అనుమతులు, ఒకేచోట ఏమాత్రం జాప్యం లేకుండా లభింపజేయబడతాయి. నిషేధించిన చోట్ల తప్ప మిగిలిన అన్నిచోట్ల షూటింగులకు కాల్ షీట్లకు కేవలం వంద రూపాయలకే డిపాజిట్ లేకుండానే అనుమతి యివ్వడం జరుగుతుంది.
    ఈరోజు ప్రభుత్వ పరంగా నేను ప్రకటించిన నిర్ణయాలు స్వల్పాతి స్వల్పం. ఎదురొచ్చే దాడులు తట్టుకొంటూ, తప్పుదారులు తప్పుకొంటూ మానవత్వపు విలువలు పెంచుకొంటూ సామాన్య సామాజిక శక్తులను సమీకరించుకొంటూ తెలుగు తోటలో వికసిస్తున్న చిరుమొగ్గలనూ, తమ్ముళ్లనూ ఏకీకృత భావంతో ఒకే బాటపై ఒకే నాదంతో నినాదంతో నడిపించాల్సిన కార్యక్రమాలు, నిర్ణయాలు, ఎన్నో...మరింకెన్నో.
    ఈ మహోన్నత లక్ష్య సాధనకు, ఈ మహాక్రతు నిర్వహణకు, ఈ చైతన్యరథం మహాప్రస్థానం చేర్చడానికి మీ అందరి అండదండలు, ఆశీస్సులు కావాలి ఎంతగానో__
    తమ బాధ్యతలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పాలక వ్యవస్థ నిర్ణయాలను అమలుపరుస్తూ ఈ కృషికి సహకరిస్తున్న అధికారులకూ, ఉద్యోగులకూ, లక్షలాది ప్రభుత్వ సిబ్బందికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెరుగుతున్న ప్రభుత్వ బాధ్యతా భారాన్ని మోసే భాగస్వాములుగా పరిశుద్ధ పరిపాలనను ప్రజలకందించాల్సిన బాధ్యత మరింతగా ఈనాడు వారిమీద వుంది. ఈ సహకారం మంచి అవగాహనతో అందిస్తారన్న విశ్వాసం వుంది నాకు.
    వారి సంక్షేమం ఈ ప్రభుత్వ ధ్యేయాలలో ఒకటి. దానికి గురుతుగా__
    * కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి కుటుంబ నియంత్రణా పథకం క్రింద లభించే ప్రోత్సాహక రాయితీలను మన రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకందరికీ లభింపజేస్తానని ప్రకటిస్తున్నాను.
    చెప్పను చేసిందీ, చేయదలచిందీ. అంతేకాదు నానుండి మీరు ఆశించింది మరెంతో ఉంది.
    వేడిగాలి వీస్తున్నది మీ గుండెలనిండా. పెద్దరికం అడ్డుపెడుతున్నది నన్ను ఆవేశపడకుండా.
    గత చరిత్ర విన్నాం, తెలుగువారి వీరవైభవ గాధలు తెలుసుకున్నాం, మరో మహోజ్వల చరిత్రను సృష్టిద్దామనుకున్నాం, కాని మనమిపుడు ఎక్కడున్నాం?
    కలుషితమైన నేటి రాజకీయ వాతావరణంలో, కుదించుకుపోయిన మానవతా విలువల్లో సగౌరవంగా జాతిమనుగడకు వీలులేని అడ్డంకులు ఎన్నో, అవరోధాలు మరెన్నో? ఏ రాష్ట్రంలో ఏ జాతి గౌరవించబడుతున్నది? అన్ని రాష్ట్రాలగోడు ఇదే ఈనాడు. పంజాబులో ఏమవుతున్నది? కాశ్మీరపు మంచుకొండలు ఏమని గర్జిస్తున్నాయి? అస్సాంలో అగ్నిజ్వాలలు ఏమని ఘోషిస్తున్నాయి? కర్నాటకలో జరిగే కుట్రల కర్థం ఏమిటి? ఎక్కడున్నది శాంతి? ఏ నాటికి లభిస్తుంది ప్రశాంతి? మూగవోయిన గొంతుతో, వెలికిరాని వేదనతో ఏమంటున్నది ఈనాడు, తెలుగు జాతి? అభ్యున్నతి కావాలి, కావాలి అని పలవరిస్తున్నది పలుమార్లు.


    అసలాలోచిస్తే ప్రజలు ఏ నమ్మకంతో మాకు కట్టబెట్టారీ పదవులు? అప్పగించారీ అధికారాలు? పాత విధానం పోవాలని, కొత్తదనం రావాలని. కడుపునిండా తిండిలేక, కట్టడానికి బట్టలేక, తలదాచుకోడానికి నీడలేక, తాగడానికి నీరులేక బ్రతుకే భారమై అలమటిస్తూ అడుగుతున్నారు దీనజనావళి మాకు సామాజిక న్యాయం ఏదని? ఎప్పుడని? ఎక్కడని? ఘోషిస్తున్నారు జనం కర్మ సిద్దాంతానికి అడ్డుకట్ట వేయాలని, తమ భవిష్యత్తు తామే తీర్చిదిద్దు కోగలగాలని.
    అజ్ఞానాంధకారంలో మనుష్యులను ఉంచడం, తెలివితేటలతో సమాజాన్ని మోసంచేయడం అధికారానికి ఆదర్శంకాదు. ఏనాడయితే రాజకీయం వ్యాపారంగా మారిందో కుటిలత్వంతో కుళ్ళిందో, ఆనాడే అంతరించాయి ప్రజాస్వామ్యపు విలువలు.
    న్యాయ దేవతను మందిరాలలో బంధించి, 'పాపం! వినడానికి చెవులే కాని చూడడానికి కళ్ళులే'వన్నా'రు, తెలివిగల మేధావులు, రాజకీయవేత్తలు, నేతలు, నాయకులు.
    కట్టలు తెంచుకుని పొంగే కడలిలా, నింగికెగసే మహోత్తుంగ తరంగంలా ముందుకురుకుతున్నది నేటి యువత. న్యాయదేవత చెర విడిపించి, వెలికితెచ్చిగంతలు విప్పి, 'చూడు తల్లీ! ఈనాటి సమాజ యదార్ధ స్వరూపమ'ని చెప్పే రోజొచ్చింది.
    అడుగుతున్నారు ఫుట్ పాత్ ల మీద బ్రతుకులు వెళ్ళమార్చుకొంటున్న నిరాశ్రయులు, మా గతి ఏమిటని, నీ తీర్పు ఏమిటని? చదువులేక, సంధ్యలేక విజ్ఞానపు వెలుగులేక మురికివాడల్లో మురిగిపోతున్న చిరంజీవులు చిరిగినా గొంతులో దిక్కుతోచని చూపుతో అడుగుతున్నారు- 
    మాకు వెలుగేదని, విమోచన ఎప్పుడని?
    యంత్రాలలో యంత్రంగా మారిపోయి శ్రమిస్తూ, రక్తాన్నే స్వేదంగా సంపదలను సృష్టించే కార్మికులు, శ్రామికులూ మాడే డొక్కలతో, కాలే కడుపులతో అడుగుతున్నారు-'తల్లీ! మాకిచ్చే న్యాయం ఏమిటని, ఎప్పుడని?'
    ప్రజాస్వామ్య విధానానికి మనం సరైన నిర్వచనం ఇవ్వాల్సిన రోజు వచ్చింది. ప్రజలు అధికారం యిచ్చింది- ప్రజలిచ్చిన అధికారాన్ని వినియోగించుకొని సమానావకాశాలు అందరికీ పంచిపెట్టడానికే. వికాసవంతమైన జాతి ఆవిర్భవించాలి. సమానావకాశాలు అందరికీ పంచిపెట్టాలి. అదీ నిజమయిన ప్రజాస్వామ్యం. పాలకవ్యవస్థ కేవలం ప్రజల సొత్తుకు ధర్మకర్తృత్వ సంఘం మాత్రమే.
    హెచ్చరిస్తున్నాయి, పీడిత, దళిత, బడుగు వర్గాలన్నీ సామాజిక న్యాయం సమకూర్చలేని పెత్తనాలు యిలాగే సాగితే రక్తాక్షరాలతో మరో విప్లవ స్వాతంత్ర్యం సమర చరిత్ర లిఖించవలసి వస్తుందని.
    ఈ ఏ.సి. రూములు, అంతస్తులు, అనుభవాలు, అధికారాలు, ఆడంబరాలు ఆనాడు మిమ్మల్ని రక్షించలేవని.
    ఇది ఈనాటి సమాజ విధానం. దీనికేమిటి మేధావులిచ్చే సమాధానం?
    వచ్చింది ప్రజాస్వామ్య విధానానికి మనం సరియయిన నిర్వచనం చెప్పాల్సిన రోజు.
    పాలక వ్యవస్థ ప్రజల సొత్తుకు కేవలం ధర్మ కర్తృత్వ సంఘం. 
    అది మరచి స్వార్ధంతో ప్రజాద్రోహానికి ఎప్పుడు పాల్పడతారో, సంఘ విద్రోహానికి తలపడతారో ఆనాడే చస్తుంది ప్రజాస్వామ్యం.
    ఈనాడున్నాయి సమస్యలెన్నో, వస్తున్నాయి అవాంతరాలు మరెన్నో, కల్పిస్తున్నారు ఆటంకాలు యింకెన్నో. అయినా మీ ఆదరాభిమానాలు అండదండలు వున్నంతవరకు, నిరోధించలేదు ఏ శక్తీ మన ప్రగతిరథాన్ని.
    మీ మనిషిగా, తెలుగు తల్లి బిడ్డగా ఈ వేదికనుండి ప్రతిజ్ఞ చేస్తున్నాను- నావారిని కించపరచే ఏ విధానాన్నీ సహించేది లేదని, జాతి గౌరవం నిలపటానికి ప్రాణాన్నైనా బలి యిస్తానని.
    ఇంత ఆవేదనలోను, నన్ను అనునయించేది మధురాతి మధురమైన మీ ఆదరం.
    మీ అండదండలే నాకు బలం.
    మీ ప్రేమానురాగాలే నా ఊపిరి.
    ఎంతగానో ఆదరిస్తున్నారు, అలనాడూ. ఈనాడూ, ఏనాడూ. మంగళారతులిచ్చి నుదుట తిలకం దిద్ది శుభం పలుకుతున్నారు ఆడబడుచులు- ఎంతో విశ్వాసంతో.
    కొండంత అండగా నిలిచారు తమ్ముళ్ళు.
    చెప్పలేను ఈ గమనం ఎటు పోతుందో- తెలియదు నాకు యీ ఆవేశం ఏ రూపం దాలుస్తుందో! ఏది ఏమైనా-అనుకున్న సమాజాన్ని మీ ముందు నిలిపేవరకూ, పేదరికాన్ని యీ నేలనుండి తుడిచిపెట్టేవరకు, అంటరానితనాన్ని ఆవల నెట్టేవరకు, కులమత భేదాలు ప్రక్కకు పెట్టేవరకు, సమసమాజ వ్యవస్థ స్థాపన జరిగేవరకు ఆగదు ఈ గమనం. మీరు కట్టబెట్టిన అధికారం మీకే దత్తం.
    తెలుగుజాతి మనది. తెలుగువాణి మనది. తెలుగుబాణి మనది. ఈ తెలుగునాడు మనది.
    పార్టీలు వేరయినా, సిద్దాంతాలు ఏమయినా అందరిదీ ఒకటే గమ్యం. అదే తెలుగుజాతి అభ్యుదయం.
    
    హైదరాబాదులో లాల్ బహదూర్ స్టేడియంలో 1984 జనవరి 9 న నూతన ప్రభుత్వ ప్రథమ వార్షిక నివేదిక సమర్పణ సదస్సులో ...

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS