ఆ పూట పనంతా కావ్యే చూసుకుంది ఇంట్లో! శోభనకి రెండు మూడు వంతులవడంవల్ల లేవలేదు. ఇటు శోభనకి ఏం కావాలన్నా అటు తల్లికి ఏం కావాలన్నా అందివ్వడం, వంటపని చూసుకోవడం అంతా చేస్తూ, స్కూలుకి కూడా వెళ్ళొస్తోంది కావ్య.
"తను తండ్రి కాబోతున్నాడని తెలిసి ఎంతో సంతోషించాడు క్రాంతి ఆ మర్నాడే తల్లి మాట ప్రకారం డాక్టరు దగ్గరకి తీసికెళ్ళాడు శోభనని.
'ఆమెకి పూర్తిగా రెస్టు కావాలనీ, మంచంమీద నుంచి దిగకూడదనీ, గర్భసంచి కొంచెం వొదులుగా వుందనీ' చెప్పింది డాక్టరు. దాంతో ప్రతీ పనీ కావ్యమీదే పడింది. బడికి కూడా సెలవు పెట్టింది కావ్య.
క్రాంతి కూడా ఇంటికి రాగానే, సగం టైము శోభనతోనే గడుపుతున్నాడు. మిగిలిన సగం టైమూ, తల్లి దగ్గర కాసేపు కూర్చుంటాడు, ఆ తరవాత ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంటాడు.
మళ్ళీ చాలా రోజుల తరవాత కావ్యకి బతుకంటే బోర్ కొట్టింది. శోభన గొడవల వల్ల, శాంత కూడా ఎక్కువగా ఇంటికి రావడం మానేసింది. మామయ్యొచ్చి, వారం రోజులుండి శోభనని చూసి వెళ్ళాడు. ఏదో నెలలో తల్లిని పంపించి బెంగుళూరుకి తీసికెళతానని చెప్పి వెళ్ళాడు. అందరూ కావ్య పెళ్ళి గురించి ఒక రకంగా మరిచిపోయారనే చెప్పాలి. తల్లిమాత్రం, వుండుండి తన దిగులు కావ్యతో వెళ్ళబోసుకుంటుంది. తనుమాత్రం ఏం చెయ్యగలదు ? క్రాంతితో చెబితే, "ఏమోనమ్మా! ఈ సమస్య ఎట్లా పరిష్కారమౌతుందో అర్ధం కావడంలేదు. ఇప్పటికి తొంభై సంబంధాలు చూశాము. ఒక్కటీ కుదరడంలేదు. ఏం చెయ్యమంటావు ?" అన్నాడు. మొదటిసారిగా అన్నయ్య మాటల్లో కూడా విసుగును చూసిన కావ్యకి, గుండెలో ఎవరో పొడిచినట్టనిపించింది! అన్నయ్య! తనని పువ్వుల్లో పెట్టి చూసుకునే అన్నయ్యే ఇలా మారిపోతే, ఇక తన గురించి పట్టించుకునే దెవరు ? అమ్మ దిగులు అందుకేనని అర్ధమయింది. మొదటిసారిగా, తను ఆడపిల్లై పుట్టినందుకు తనని తాను నిందించుకుంది. దుఃఖాన్నాపుకోలేక, పెరట్లో కెళ్ళి, అశోకవనంలోని సీతలాగా, గంటల తరబడి ఏడ్చింది.
తనూ క్రాంతితో ముక్తసరిగానే మాట్లాడుతూ వొచ్చింది. తల్లికి ఒకరోజు గుండెనొప్పి ఎక్కువైంది. మళ్ళీ వారం రోజులు నర్సింగ్ హోంలో వుంచాల్సొచ్చింది. ఇంటిపనీ, బయటపనీ చేస్తూ, అలిసిపోతోంది కావ్య! కాస్సేపు మనశ్శాంతి కోసం శాంతతో, పెరటి గోడ దగ్గరకెళ్ళి మాట్లాడుతూ వుంటే, తనగురించే ఏదో చెబుతోందని, క్రాంతికి ఫిర్యాదు చేసింది శోభన! అది విని, అది నిజమా, అబద్ధమా అని కూడా ఆలోచించకుండా, కావ్యని కోప్పడ్డాడు క్రాంతి. అది మొదలు కావ్య, శాంతతో కూడా మాట్లాడ్డం మానేసింది.
సంగతి తెలుసుకున్న శాంత కూడా కావ్యని పలకరించడం మానేసింది!
కావ్యకి ఎవరూ లేరు!
అందరి మధ్యనే ఉంటుంది మళ్ళీ!
చెయ్యని తప్పుకి శిక్ష ననుభవిస్తూ, ఒంటరిగా ఏడుస్తూ కాలం గడుపుతోంది కావ్య!
గతం చేదు విషం !
వర్తమానం భయంకర పిశాచి !
భవిష్యత్తు అగమ్య గోచరం ! అంతా చీకటి !
ఆమె ధ్యాసంతా తల్లి మీదే !
ఆమె తపన అంతా ఆమెని బాగుచేసుకోవాలనే !
ఆహారాత్రులూ ఆమె సేవలోనే మునిగి తేలుతోంది కావ్య !
ఎన్నో ప్రార్ధనలు చేస్తోంది. కానీ, ఏదేముడూ కరుణించలేదు.
ఆ రోజు రాత్రి !....ఘోరమైన సంఘటన !....
సీతాదేవి నోట్లోంచి నురుగులు కక్కుతూ కళ్ళు తేలేసింది !
క్రాంతి డాక్టర్ని పిలుచుకొచ్చాడు !
డాక్టరు పెదవి విరిచాడు !
అప్పటికే ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి !
గొల్లుమన్నాడు క్రాంతి !
తలబాదుకుంది కావ్య !
సీతాదేవి మట్టుకు ప్రశాంతంగా నిద్రపోతూన్నట్టుగా వుంది ! ఏ బాధా లేదు ఆమె మొహంలో. ప్రశాంతమైన సుషుప్తికి మరణ మొక్కటే పరిష్కారమా ? కావ్య పిచ్చిదానిలా చూస్తుండిపోయింది !
15
తల్లి మరణవార్త వినగానే,
అందరు మామయ్యలూ అందరత్తయ్యలూ వొచ్చారు వార్త తెలీగానే. పెద్ద మామయ్యే కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించాడు. పన్నెండు రోజులూ భోజనాలూ, కాఫీలూ, ఫలహారాలు, అంతా ఒక పెళ్లి ఇల్లులా అనిపించింది. ఒకమూల కూర్చొని కన్నీరు కార్చడం తప్ప, కావ్య ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఎవ్వరూ ఆమెని పలకరించేవారు కాదు అస్తమానం పెద్ద మామయ్య క్రాంతిని అంటిపెట్టుకుని తిరగడం వల్ల, క్రాంతితోకూడా తను మాట్లాడడానికి అవకాశం వుండేది కాదు.
తల్లి మరణంతో మరీ ఒంటరిదై పోయింది కావ్య. మూగదానిలా అయిపోయింది. మామయ్యలూ, అత్తయ్యలూ, అందరూ క్రాంతిని ఓదార్చేవారే గానీ, కావ్యని పట్టించుకునేవారే కరువయ్యారు. ఎప్పుడైనా కాస్త సమయం చూసుకుని క్రాంతి కావ్యని పలకరించడానికొస్తే అతనున్నంత సేపూ, వాళ్ళూ అక్కడే వుండి, సానుభూతిని చూపేవారు. అన్నయ్యతో మనసు విప్పి మాట్లాడుకోవడానికి గానీ, తనివితీరా అతణ్ణి పట్టుకుని ఏడవడానికిగానీ, అవకాశం వుండేది కాదు. చిన్నప్పటి నుంచీ ఒక్కొక్క సంఘటనా గుర్తుకొచ్చి, తల్లిని తలుచుకుని గుండె బద్దలయ్యేలా రాత్రంతా ఒంటరిగా ఏడ్చేది. ప్రతి నిముషం ముళ్ళమీద వున్నట్టుగా అనిపించింది కావ్యకి!
పదమూడో నాటికి బంధువులంతా ప్రయాణమై వెళ్లిపోయారు.
తెల్లారితే ప్రయాణమనగా, "ఏడోనెలన శోభనని బెంగుళూరు తీసికెళ్ళాలా వొద్దా! తీసికెళితే ఇక్కడ క్రాంతికి ఇబ్బందవుతుందేమో" అంటూ సంభాషణ మొదలెట్టారు.
"తానొకర్తి ఆ ఇంట్లో వుందనీ, తనకీ ఆ ఇంటితో, ఆ వ్యక్తితో సంబంధం వుందనీ ఎవ్వరికీ తోచనందుకు ఎంతో బాధపడుతూ, "నేనున్నాగా, అన్నయ్యకి వండిపెట్టడానికి. మీరు వొదిన్ని తీసికెళ్ళండి" అంది.
ఎవ్వరూ మాట్లాడలేదు.
కాస్సేపటికి శోభనే అంది "అమ్మా! నేనిక్కడే వుంటాను, మీరే డెలివరీ టైముకి ఇక్కడికి రండి" అంది ఒక నిర్ణయానికి వొచ్చినట్టుగా.
అందరికీ ఆ సలహాయే నచ్చినట్టుంది.
కనీసం అన్నయ్యైనా "కావ్య వుంటుంది కదా! చూసుకుంటుంది, నువెళ్ళికాకముందు ఎలా వుండేవాడు, ఎలా మారిపోయాడు! తనకోసం ఎంతబాధపడేవాడు." కాలేజీ నుంచి ఇంటికి రాగానే, క్షణం ఒదలకుండా కబుర్లు చెప్పేవాడు." తలుచుకుని పాతరోజుల్ని, ఆ తియ్యని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ప్రస్తుత పరిస్తితిలో రాజీపడలేక, తల్లి మంచంమీద పడుకుని, ఆమె ఫోటోని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
"అమ్మా! నువ్వు చెప్పిందంతా అక్షరాలా నిజం అమ్మా! నువ్వు న్నంతవరకేనమ్మా నా జీవితం హాయిగా సాగిపోయింది. నాకోసమూ ఏడ్చే ఒక మనిషున్నారనీ, నాకోసం, నా ముఖం కోసం పరితపించే ఒక వ్యక్తి వుందనీ, ఎంతో తృప్తిగా వుండేదమ్మా! లోకం నన్నుకాదన్నా, అందరూ వెలేసినా, నీ వొళ్ళో తలపెట్టుకుని పడుతుంటే, నీ మాటలు వింటూంటే, అన్నీ మరిచిపోయి, ఏదో తృప్తిని పొందేదాన్ని! ఇప్పుడు ఎవరితో చెప్పుకోనమ్మా ? నా మనసువిప్పి ఎవరిముందర పరచను ? అమ్మా! నన్నూ నీతోపాటే ఎందుకు తీసుకుపోలేదమ్మా ? ఒక్కమాటైనా చెప్పకుండా నాకోసమే పరితపిస్తూ, ప్రాణత్యాగం చేశావు! నావల్ల నీకు దుఃఖమేకానీ, ఎన్నడూ సుఖమన్నది కలగలేదు. అమ్మా! నన్ను క్షమించు! అమ్మా నన్ను క్షమించు! అమ్మా....అమ్మా!" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ, పిచ్చిదానిలా పెద్దగా ఏడుస్తున్న ఏడుపువిని కావ్య మంచం దగ్గర చేరుకున్నారు అందరూ. ఆ క్షణంలో కావ్యని చూస్తే, కసాయిగుండె కయినా కన్నీరు రాకమానదు. గుండె పగిలిపోయేలా తల్లి ఫోటోని పట్టుకుని విలపిస్తున్న కావ్యని చూస్తే క్రాంతికి దుఃఖం ఆగలేదు.
"కావ్యా! ఊరుకో! మనం దురదృష్టవంతులం! ముఖ్యంగా నువ్వు మరీనూ! కనీసం నీ పెళ్ళయ్యే దాకానయినా అమ్మ మనకి మిగల్లేదు. ఏడవకు! ఏడిస్తే అమ్మొస్తుందా ? ఊరుకోమ్మా ఊరుకో!" అంటూ కావ్యని పట్టుకుని ఓదార్చాడు తలనిమురుతూ!
"అన్నయ్య!" అంటూ పసిపిల్లలా అతణ్ణి చుట్టేసి గొల్లుమంది కావ్య!
ఆ అన్నా చెల్లెళ్ళ హృదయాలు రెండూ కన్నతల్లి కోసం విలవిల్లాడి పోయాయి!
ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లనట్టు అన్నయ్యమీద వాలిపోయింది కావ్య. శోభన నీళ్ళు తెచ్చి జల్లింది మొహంమీద.
మెల్లగా మంచంమీద పడుకోబెట్టాడు క్రాంతి కావ్యని! వేడిపాలు తెమ్మన్నాడు ఒకకప్పు. తను స్వయంగా దగ్గరుండి తన చేతులతో పాలు తాగించాడు.
"అన్నయ్యా! నన్నొదిలిపెట్టి వెళ్ళకు! అన్నయ్యా! నాకు భయమేస్తోంది! నేనూ అమ్మదగ్గని కెళ్ళిపోతాను!" అంటూ హృదయ విచారకంగా ఏడుస్తూన్న కావ్యని ఓదార్చలేక, ఆమెకి రెస్టు అవసరమనీ, తను దగ్గరున్నంత సేపూ అలాగే బాధపడుతుందనీ గ్రహించి, నిద్రకోసం ఏదో టాబ్లేట్టు ఇచ్చాడు క్రాంతి. పసిపాపలా అన్నయ్యని కరిచి పట్టుకుని నిద్రలోకి జారుకుంది కావ్య.
పదిహేను రోజులు పట్టింది పథ్యం తినడానికి కావ్యకి! క్రాంతి ఇంట్లో వున్నంతసేపూ, తన మంచందగ్గర కూర్చుంటాడు. ఆ తరవాత రాత్రి మళ్ళీ అతనోచ్చెంత వరకూ ఆమెతో మాట్లాడే దిక్కేవుండదు. అప్పుడప్పుడు మిసెస్ శాంతవొచ్చి పలకరించి, తలదువ్వి, బట్టలు మార్చి వెళ్ళేది. అదికూడా సహించలేని శోభన అన్నయ్యకి ఫిర్యాదు చేసింది.
"నే జెడవేస్తానంటే ఒద్దంటుంది. శాంత చేత వేయించుకుంటుంది. ఆమెచేత బట్టలు మార్పించుకుంటుంది .ఆమె ఏమనుకుంటుంది ? వొదిన గారు సరిగ్గా చూడదని అనుకోదూ ? ఇదంతా నన్ను ఆరడి పెట్టడానికేగా?" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకునేది!
