Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 14

 

    ఇంత పూర్వం విశ్వ ప్రేమతో సువిశాలమయిన ఆమె అంతర్యం ఇప్పుడు జ్యోతి పట్ల ప్రేమతో, స్వార్ధాన్ని సంతరించుకుని చాలా సంకుచితమయింది. ఈ ఇరుకుతనం ఆమెకు ఆనందాన్నే యిచ్చింది. పదేపదే ఆమె శిరసును ముద్దాడసాగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "అమ్మా! జ్యోతి! చాలా దిరదృష్టకరమైన క్షణాలు. నా గురించి ఆలోచించ వలసిన సమయం కాదిది. నీవయినా నేనయినా నీ గురించే ఆలోచించ వలసిన సమయం" అన్నదామె వణుకుతున్న కంఠస్వరంతో .
    'అమ్మా! ఏమయింది? మీరిలా ఎందుకంటున్నారు. తామ్రపత్రాలలోని భాష మీకర్ధమయిందా? వాటి గురించి తెలియకూడని విషయాలు ఏమైనా తెలిశాయా?" అని అడిగింది జ్యోతి. రవంత సేపు మౌనం వహించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    ఆ తరువాత చెప్పటం తప్పనిసరి అన్న నిశ్చయానికి వచ్చింది.
    "డియర్ జ్యోతి ! జాగ్రత్తగా విను తల్లీ. తామ్రపత్రాలు చదవటం ముగించాను అవి నాకు అర్ధమయినాయనే అనుకుంటున్నాను. ఆనాడు నీ తండ్రి నీకు కలలో కన్పించి చెప్పిన మాటలు యదార్ధమే! ఆ విషయాలు తామ్రపత్రాలలోనూ వ్రాసి వున్నాయి.
    ఇంచుమించు మూడు వేల సంవత్సరాలకు పూర్వం కృష్ణా తీరంలో స్వజాతి జనుల శ్రేయ కామనతో ఆత్మార్పణ కావించిన నాగజాతి యువతి ఆత్మ కృష్ణాతీరంలోని ఒక సమాధి గుహలో నిక్షిప్తమయి ఉంది. అది విముక్తి కోసం పరితిస్తుంది.
    "ఆ యువతి పేరు శ్వేతకి. దాని ఆత్మను అలా నిక్షిప్తం కావించి తామ్రపత్రాలలో ఆ సమాచారం అందించినవాడు గొప్ప మంత్ర విద్యాశక్తి శాలి అయిన అగోచర శాక్తేయుడు.
    అతడు సప్త సింధు ప్రాంతంలోని పుష్కలవతీ, నగరం నించి వచ్చాడు. ఆమె ప్రాణాలను బలిగొన్న కళింగభూములలోని జనావాసాలకు తలమానికమనిపించే కుంభవతిని పాలించిన రాజు, అతడు రాజ్య విస్తరణ కాంక్షపరుడు. పేరు క్షుద్రకాళింగుడు. రాజ్య విస్తరణ కాంక్షాపరులు వారెవరయినా సరే విక్రమాదిత్యుడు అశోకుని వంటి వారయినా సరే వారు క్రూరులు.
    ఆ క్రౌర్యం లేనిదే రాజ్యవిస్తరణ కాంక్షాపరుల ఆశయం నెరవేరదు. అందునించి క్షుద్రకాళింగుడు దయారహితంగా శ్వేతకి ప్రాణాలను బలికొన్నాడు.
    ఆమె బ్రతుకు భాండం బ్రద్దమయింది. తనవాడయిన పురుషునీ, ప్ర్రేమనూ, పెళ్ళినీ , తన ప్రజలనూ విడిచి ఆమె ప్రాణాలు విడిచి పెట్టింది.
    కాని ఆమె ఆత్మకు శాంతి లభించలేదు. నాగయక్షపుండ్రపుళిందాదులు క్షుద్రకాళింగుని బానిసలయినారు. ఈ కృష్ణా తీర మంతా అతని విష కౌగలిలోకి వెళ్ళిపోయింది.
    వారి విముక్తి కోసం పరితపిస్తున్న ఆత్మ రూపాన్ని తన శక్తితో రాక్షస గుహలో బంధించాడు అగోచర శాక్తేయుడు.
    అప్పటి నుంచి అది విముక్తి కోరుతోంది.
    ఆ పనిచేయవలసిన బాధ్యతను స్వీకరించాడు మంత్ర విద్యావేత్త అయినా మీ తాత. కాని అకాల మరణం వల్ల ఆ పని అర్ధాంతరంగానే ఆగిపోయింది.
    నీ తండ్ర్రి అందుకు చాలిన వ్యక్తిత్వం లేని సామాన్యుడు. అందు నించి ఆ బాధ్యత నీ మీద పడింది.
    తప్పదు తల్లీ! ఈ పరిస్థితిని నీవు ఎదుర్కొనవలసి రావటం అనివార్యమయినదే కావచ్చు" అని చెప్పింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    ఆమె మాటలను అత్యంత శ్రద్దాసక్తులతో వింటున్న జ్యోతి విభ్రాంతఅయింది. ఆమె నేత్రాలు విశాలమయినాయి.
    ,ముఖం పూచినా తంగేడులా అయింది. ఊర్పులు దీర్ఘాతరాలయినాయి. చివాలున లేచి నిలిచిందామె తోక త్రొక్కిన త్రాచులాగ!
    "ప్రొఫెసర్ మేడమ్! తెలిసో తెలియకో నేను ఈ పరిస్థితిలో చిక్కుకున్నాను. మంత్రవేత్త అయిన మా తాత గారి నించి వారసత్వంగా వచ్చిన రక్త మాంసాల శరీరమిది. వారి నించి వారసత్వంగా వచ్చిన బాధ్యతలను కూడా నేను మన్హ పూర్వకంగా స్వీకరిస్తాను.
    తామ్రపత్రాల మీద వ్రాసి ఉన్న రాకాసి గుహలోని శ్వేతకి ఆత్మను విముక్తం చేస్తాను. మీ ఆశీస్సులు నాకు లభించి, మీ నిర్దేశకత్వం సంప్రాప్తమయిన కఠిన తరమయిన ఈ కర్తవ్యంలో ఎదురు అయే ప్రమాదాల గురించి నేను జడియను.
    రక్తపాతమే కావచ్చు. ప్రాణాలయినా పోవచ్చు. కాని నాగయువతి శ్వేతకి మమ్మీని వెతికి పెట్టిన తరువాత కాని నా పంతం విడవను. ఆ తామ్రపత్రాలను చదివే లింగ్విస్టిక్ పరిభాషను ముందుగా నాకు నేర్పించండి " అంటూ అర్ధించింది జ్యోతి.
    ఆమె ఆత్మ విశ్వాసపూర్ణమయిన మాటలకు అచ్చెరువు పడింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. మనసు లోలోపల ఆనందపు టంచులను చూడ గలిగిందామె. తగిన శిష్యురాలు అనుకుంది.
    అంత పట్టుదల కలిగిన ఆడపిల్ల భావి తరాలకు ఆదర్శ ప్రాయురాలు కాగలదు. వ్యక్తావ్యక్త,మయిన ప్రకృతి లో అగాధమయిన రహస్యాలు ఇంకా అనేకం మిగిలివున్నాయి.
    వాటిని పరిశోధిచి వెలికి తీయాలంటే త్యాగభావంతో ముందుకు రాగలిగిన ఇటువంటి యువతీ యువకులు పూనుకోవాలి. అప్పుడే ప్రపంచానికి అర్ధం కానివి ఎన్నో అర్ధమవుతాయి.
    ఈనాటి పురుషాధిక్య ప్రపంచమూ, విధ్యావిదానమూ, ఆర్ధిక స్థితి గతులూ యువతులను ఎందుకూ కొరగాని వారుగా చేసి వేస్తున్నాయి.
    కుమారికలుగా వున్నప్పుడు పెళ్ళి గురించి, తాను అధారపడబోయే  ఆ పురుషుని మంచితనం మీద నమ్మకం గురించీ కలలు కనటం ఒక దశ! పెళ్ళి అయాక స్వేయ మయిన అభిప్రాయాలన్నింటినీ ప్రక్కకు చిత్తిగించుకుని తన వారయిపోయిన ఆ పురుషుని అభిప్రాయాలతో సమన్వయం సాధించుకుందుకు సతమతమై పోవటం రెండవ దశ.
    ఈ దశలు దాటి వచ్చే వేళకు బ్రతుకు సగం పైగా ఖర్చు అయిపోతుంది ఆ తరువాత సాదించేది ఏమున్నది? కనీసం కలలు కంటూ ఆనందించే స్థితి అయినా మిగిలి వుండదు.
    పరిస్థితులతో నిష్పేచీగా రాజీపడిపోయి ఆత్మను చంపుకుని అంతర్యం లోని అగ్ని తాపాన్ని భరించటం. ఈ విధంగా యాంత్రికమై పోయిన ఈ పురుషాధిక్య ప్రపంచంలోని ఆడదాని బ్రతుకు అర్ధరహితంగా మారిపోయింది. యిటు వంటి స్టితిలో తమ వ్యక్తిత్వాలను నిలుపుకోగలిగిన యువతులు సాహసంతో ఇటువంటి ప్రయోజనకరమయిన అంశాల గురించి పరిశోధిస్తామంటూ బయలుదేరడం ఆనందకరం.
    జ్యోతిని చూచుకుని మురిసిపోయింది ప్రొఫెసర్.
    వెంటనే యూనివర్శిటీ కి ఫోన్ చేసి వారం రోజులు తాను సెలవు పెట్టేస్తున్నానని చెప్పేసింది.
    జ్యోతి ఇంటర్ పూర్తీ చేసింది కనుక నించి రిఫరెన్స్ బుక్స్ అన్నింటినీ దగ్గర వుంచుకుని వారం రోజుల్లో లింగ్విస్టిక్స్ నేర్పించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    సప్తదివారాత్రులు శ్రమించి ప్రాచీన లిపి శాస్త్రంతో గాడమయిన పరిచయాన్ని సాధించగలిగింది జ్యోతి. తన పని పూర్తి అయాక యూనివర్శిటీ కి వెళ్ళిపోయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    ఆమె అలా వెళ్ళి పోగానే తలుపులు అన్నీ బిగించుకుని తామ్రపత్రాలను ముందు పెట్టుకుని కూర్చుంది జ్యోతి.
    ఆ విషయాలన్నింటిని చదువుతున్నప్పుడు ఆమెను అవదు లేరగని ఆశ్చర్యం ముంచెత్తసాగింది. చివరి తామ్రపత్రంలో రాకాసి గుహలోని మమ్మీ గురించిన వివరాలున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS