ఆ రోజు సాయంకాలం బయలుదేరి మరో మజిలీ ఈ మజిలీలో ఊళ్ళో కడుగుపెడుతూనే ఇద్దరు మనుషుల్ని "మేం ఆన్ ఫుట్ బ్యాచ్ వాళ్ళం సత్రం ఏమైనా దగ్గర్లో వుందా?" అనడిగారు.    
    వాళ్ళు "మా వెంటరండి!" అంటూ వెంటపెట్టుకుని తీసికెళ్ళి, ఓ పెద్ద గేటుతీసి లోపలికి పంపించారు. లోపల బావీ అదీ బాగానే వుంది. మొహాలవీ కడుక్కుని సేదదీరాకా    
    "మేం వెళ్ళి తినాడానికేమన్నా తీసుకొస్తాం" అని శ్రీహరిరావూ, రాజూ బయలుదేరి గేటు దగ్గరి కొచ్చేసరికి దానికి తాళం పెట్టబడి వుంది.    
    బయట ఇందాకటి మనుషులు నిలబడి వుండడం చూసి- "ఎందుకిలా తాళం పెట్టారు?" అనడిగారు. వాళ్ళు "పైకి చూసి, బోర్డు చదవండి" అని సమాధానం యిచ్చారు. పైకి చూస్తే ఏముందీ? అదో సబ్ జైలు అని పేరు రాసి వుంది. "ఇదన్యాయం!" అన్నారు వాళ్ళు "ఊళ్లోకి రాత్రిపూట కొత్తవాళ్ళు వస్తే అంతే!" అన్నారు వాళ్ళు నిర్లక్ష్యంగా.    
    ఆ రాత్రి కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకున్నారు. మర్నాడు ఉదయం కొత్వాలు దగ్గిరికి తీసుకెళ్ళారు. ఆయన ఎంతకీ రాడు. అక్కడున్న గుమాస్తాతో- "మా పిల్లకి జ్వరంగా వుంది! నేనూ,  నా భార్యా వెళ్ళి డాక్టర్ కి చూపించి తీసుకొస్తాం" అని శ్రీహరిరావుగారు అడిగారు. అందుకతను కాసేపు సంశయించి చివరికి ఒప్పుకున్నాడు.    
    ఇద్దరూ పిల్లని తీసుకెళ్ళి డాక్టర్ కి చూపించి, తరువాత ఇంగ్లీషులో తమని అనవసరంగా అరెస్ట్ చేశారనీ, తాము కాంగ్రెసు వాళ్ళమనీ డాక్టర్ కి చెప్పారాయన ఆయన అంతా విని, దివాన్ గారికి సవిస్తరంగా తెలియజెయ్యమని సలహా యిచ్చాడు.    
    ఇదంతా ఓ చీటీమీద వ్రాసి, దివాన్ గారి జవానుకిచ్చి వీళ్ళ వెంట వచ్చిన కానిస్టేబుల్ కంగారుపెట్టడంతోటి కొత్వాలు ఆఫీసు కొచ్చేశారు.    
    కానీ, కాసేపట్లోనే కొత్వాలుగారి దగ్గరనుండి "వీళ్ళని వదిలివెయ్యవలసిందనీ, తన దగ్గరకు పంపవలసిందనీ" కబురు వచ్చింది.    
    దివాన్ గారి ఆదరణపూర్వకమైన ఆతిధ్యం తీసుకున్న తరువాత మరో మజిలీకి బయలుదేరారు.    
    చివరికి 'కాన్ పూర్' చేరారు.    
    'లక్నో'కి చాలా దగ్గరకి వచ్చేశారన్నమాట! రమణమ్మనీ, చంటి పిల్లనీ, సుబ్రహ్మణ్యాన్నీ లాఠీలోకి ఎక్కించి పంపించేశారు. వాళ్ళు నడక మొదలెట్టారు.    
    1936 ఏప్రిల్ 27న ఉదయం పదిగంటలకి రమణమ్మా, సుబ్రహ్మణ్యంగార్లు లక్నోలో కాలుమోపారు. ఐదునెలలు నిర్విరామంగా నడిచి నడిచి ఎట్టకేలకు గమ్యం చేరారు. అక్కడో అరుగుమీద దిగి, మట్టిపిడతలతో అమ్మే 'టీ' కొనుక్కుని తాగి, తర్వాత పిల్లమటుక్కి వంటచేసి పెట్టి, మిగతావారికోసం ఎదురుచూడసాగారు.    
    పెద్ద పెద్ద అరుపులతో, నవ్వులతో మిగతా బృందం రాత్రి పది గంటలకి చేరుకున్నారు. ఒకర్నొకరు అభినందించుకుని, సావిత్రిని ఎగరేసి ముద్దులు పెట్టుకునీ, విజయోత్సాహం చాటుకున్నారు.    
    తమ సుదీర్ఘ ప్రయాణంలో ఎదురయిన ఆనందాలూ, ఆపదలూ ఒక్కసారి సమీక్షించుకుని ఆ అనుభూతులని ఆస్వాదించారు. కొన్ని కొన్ని సార్లు అనుభవిస్తుండగా కంటే ఆ అనుభూతుల్ని నెమరువేసుకోవడంలోనే ఎక్కువ ఆనందం వుంటుంది.    
    మర్నాడు డెలిగేట్స్ కోసం నిర్ణయించబడ్డ బలరాంపూర్ క్వార్టర్స్ చేరుకున్నారు. అందులో వీరికి ప్రవేశం దొరకలేదు.  ఆ రోజుకి నెహ్రూ గారి భార్య కమలాదేవి మరణించి 23 రోజులయింది. పిండాలవీ వేసి, కమలానగర్ పేరిట కాంగ్రెస్ డెలిగేట్స్ కోసం క్వార్టర్స్ నిర్మిస్తున్నారు.    
    "పంతులూ! ఏం చేద్దాం!" అన్నారు బృందంలో వాళ్ళు.    
    "అలవాటేగా మనకి! రాగ్గులతో డేరాలు వేసుకుని ఆ చెట్లక్రిందే వుందాం!" అన్నారాయన. వెంటనే డేరాలు నిర్మించబడ్డాయి. అందులో నివాస మేర్పరుచుకున్నారు.    
    ఎటు చూసిన పెళ్ళివారి సందడి! ఎకడెక్కడినుంచో డెలిగేట్స్ వచ్చి చేరుతున్నారు. కొత్త కొత్త వారితో పరిచయాలు, మహాత్ముడిని గురించిన ఆలోచనలు. నెహ్రూగారొస్తున్నారన్న ఆనందం! అంతా కోలాహలం అందరం ఒక్కటే. మనందరిదీ ఒకేబాట. ఒకేమాట అన్నట్లున్న స్నేహపూరిత వాతావరణం.