అమ్మమీద ఒట్టేసి అబద్ధం చెప్పాడు! ముగ్గురికి సారీ చెప్పాడు!!
on Sep 28, 2021
గత వారం తాను చేసిన తప్పుకు యాంకర్ రవి ముగ్గురు మహిళకు సారీ చెప్పాడు. ఒకరు... లహరి. రెండు... ప్రియ. మూడు... తన తల్లి. ఇంతకీ, అతను చేసిన తప్పేమిటి? ఎందుకు? అని అంటే... 'బిగ్ బాస్'లో రవి, ప్రియ, లహరి మధ్య గత వారం జరిగిన విషయం గేమ్ షోను ఫాలో అవుతున్న వాళ్ళకు తెలిసే ఉంటుంది.
షో నుండి బయటకు వెళ్లిన తర్వాత లహరి యాంకరింగ్ చేయాలని అనుకుంటుందని, అందుకే తనతో సన్నిహితంగా ఉంటుందని ప్రియతో రవి చెప్పాడు. బ్రహ్మచారిలను వదిలేసి పెళ్ళైన తన చుట్టూ తిరుగుతుంటే చెప్పలేకపోతున్నానని ప్రియ దగ్గర మాట్లాడాడు. లహరికి ఆ తర్వాత అదే విషయం చెప్పగా మాట మార్చేశాడు. తల్లిపై ఒట్టు వేసి తాను అలా అనలేదని చెప్పాడు. వీకెండ్ రవి బండారం మొత్తం నాగార్జున బయటపెట్టారు. అతడికి క్లాస్ కూడా పీకారు. ఈ నేపథ్యంలో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియలో లహరి, ప్రియతో పాటు తల్లిని క్షమాపణలు కోరాడు రవి.
"మీ అందరి (ఇంటిలో సభ్యులను ఉద్దేశిస్తూ) ముందు తల ఎత్తుకోవడానికి సిగ్గుగా ఉంది. శనివారం నా జీవితంలో వరస్ట్ డే. ఈ విషయంలో నేను ముగ్గురికి సారీ చెప్పాలి... ప్రియ, లహరి, మా అమ్మకు! ఎంత దారుణమంటే... నేను అక్క (ప్రియ)తో చెప్పిన మాటలు చెప్పలేదని మా అమ్మ మీద ఒట్టేశా. ఓ మగాడు అలా మాట్లాడకూడదు. కానీ, మాట్లాడాను. లహరి వెళ్లిపోయినందుకు బాధగా ఉంది. ఆమె ఇక్కడ ఉంటే కచ్చితంగా ఆమెతో సమస్యను పరిష్కరించుకునేవాడిని" అని రవి చెప్పాడు. రవి ఇష్యూ మీద షో నుండి బయటకు వచ్చిన లహరి ఎలా స్పందిస్తుందో చూడాలి. గేమ్ పరంగా అతడికి ఆ కామెంట్స్ మైనస్ అయ్యేలా ఉన్నాయి.