భారీస్థాయిలో 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' చిత్రాల బిజినెస్!
on Jan 3, 2023
ఈ సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి'తో నందమూరి బాలకృష్ణ, 'వాల్తేరు వీరయ్య'తో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. జనవరి 12న 'వీర సింహా రెడ్డి', జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలపైనా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ పరంగా పది కోట్ల తేడాతో 'వాల్తేరు వీరయ్య' పైచేయి సాధించినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో 'వాల్తేరు వీరయ్య' రూ.72.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు అంచనా. ఏరియాల వారీగా చూస్తే ఆంధ్రాలో రూ.40 కోట్లు, సీడెడ్ లో రూ.14.5 కోట్లు, నైజాంలో రూ.18 కోట్లకు రైట్స్ అమ్ముడైనట్లు వినికిడి. మెగాస్టార్ గత చిత్రాలు 'ఆచార్య', 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ విన్నర్స్ గా నిలవలేకపోయినప్పటికీ.. 'వాల్తేరు వీరయ్య' ఈ స్థాయిలో బిజినెస్ చేయడం విశేషం. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించనుండటం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ క్రేజ్ కి మాస్ రాజా తోడు కావడంతో ఈ స్థాయి బిజినెస్ జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక 'వీర సింహా రెడ్డి' థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో రూ.62.50 కోట్లకు అమ్ముడైనట్లు వినికిడి. ఆంధ్రాలో రూ.35 కోట్లు, సీడెడ్ లో రూ.12.5 కోట్లు, నైజాంలో రూ.15 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. బాలకృష్ణ గత చిత్రం 'అఖండ' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే ఆయన కెరీర్ లోనే భారీస్థాయిలో 'వీర సింహా రెడ్డి' బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
Also Read