అశోక్రెడ్డి అకౌంట్ నుంచి శ్రావణి అకౌంట్కు మూడేళ్లలో రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్!
on Sep 16, 2020
టీవీ తార కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్ 100 మూవీ ప్రొడ్యూసర్ అశోక్రెడ్డి గుమ్మకొండ పోలీసులకు లొంగిపోయారు. ఆయనకు హాస్పిటల్లో కరోనా పరీక్ష చేయించారు. శ్రావణి కేసులో ఆయన ఏ2గా ఉన్నారు. ఇప్పటికే ఏ1, ఏ3గా ఉన్న దేవరాజ్, సాయికృష్ణారెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం ప్రెస్మీట్లో ఈ కేసులో ఏ3గా దేవరాజ్ను పేర్కొన్న పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఏ1గా పేర్కొనడం గమనార్హం.
మొదట్లో సాయికృష్ణారెడ్డి, అశోక్రెడ్డిలకు సన్నిహితంగా మెలగుతూ వచ్చిన శ్రావణి.. అనంతరం దేవరాజ్ పరిచయంతో అతనికి సన్నిహితమైందని పోలీసులు వెల్లడించారు. ఇది సాయికీ, శ్రావణి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దేవరాజ్కు దూరంగా ఉండాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో శ్రావణిపై సాయి చేయి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాయి, అశోక్రెడ్డిలతో శ్రావణి సన్నిహితత్వం తెలిసిన దేవరాజ్ ఆమెను పెళ్లిచేసుకోనని చెప్పినందువల్లే శ్రావణి మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు పాల్పడిందని వెస్ట్జోన్ డీసీపీ ఎ.ఆర్. శ్రీనివాస్ చెప్పారు.
శ్రావణిని ఆత్మహత్యకు ప్రేరేపించడంలో ఈ ముగ్గురికీ పాత్ర ఉందని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం అజీజ్ నగర్లో షూటింగ్ లొకేషన్ నుంచి శ్రావణిని దేవరాజ్ తీసుకు వెళ్లాడు. పంజాగుట్టలోని శ్రీకన్య హోటల్లో ఆ ఇద్దరూ డిన్నర్ చేశారు. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకున్న సాయికృష్ణారెడ్డి అక్కడికి వచ్చాడు. శ్రావణిపై చేయిచేసుకొని ఆటోలో తీసుకువెళ్లాడు. దేవరాజ్ను కలవవద్దని సాయి, అశోక్రెడ్డి ఆమెను బెదిరించారు. దేవరాజ్ను చంపుతామనీ, ఆర్థికంగా ఇబ్బంది పెడతామనీ హెచ్చరించారు.
ఈ నేపథ్యంతో హైదరాబాద్ వదిలి దూరంగా వెళ్లిపోదామని దేవరాజ్ను కోరింది శ్రావణి. అందుకు దేవరాజ్ ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తమ రిపార్డ్లో వెల్లడించారు. దాంతో ఆమె మృతికి ప్రధాన కారకుడిగా దేవరాజ్ను పేర్కొంటూ అతడిని కేసులో ఏ1గా మార్చారు పోలీసులు. ఇప్పటికే అతడితో పాటు సాయికృష్ణారెడ్డినీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన పోలీసులు, బుధవారం తమ దగ్గర లొంగిపోయిన ఆర్ఎక్స్ 100 ప్రొడ్యూసర్ అశోక్రెడ్డినీ అరెస్ట్ చేశారు. ఆయన పంజాగుట్ట ఏసీపీ ఎదుట లొంగిపోయారు. శ్రావణి ఆత్మహత్య కేసులో తన పేరు బయటకు వచ్చినప్పట్నుంచీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అప్పట్నుంచీ ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.
2017 నుంచి ఇప్పటివరకూ అశోక్రెడ్డి బ్యాంక్ అకౌంట్ నుంచి శ్రావణి అకౌంట్కు రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయని గుర్తించారు. దీనిపై పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి శ్రావణితో ఆయన అనుబంధం ఏర్పరచుకున్నట్లు భావిస్తున్నారు.
Also Read