అత్తింటిని దోచుకొని పరారీ అయిన టీవీ నటి!
on Sep 16, 2020
టీవీ సీరియల్ స్ర్కిప్ట్ తరహాలోనే ఓ నటి వార్తల్లో నిలవడం సంచలనం సృష్టించింది. సన్ టీవీలో ప్రసారమవుతున్న 'దైవమగల్' సీరియల్లో అఖిల అనే పాత్ర పోషిస్తోన్న సుచిత్ర అనే నటి తన సొంత మెట్టినిల్లునే దోచి, పరారీ అయ్యింది. ఇటీవల ఆమె మణికందన్ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అతను ఫిల్మ్ ఇండస్ట్రీలో చేరాలనే ఉద్దేశంతో తన స్వస్థలం పన్రుతి నుంచి చెన్నైకు వచ్చి, ఉపాధి కోసం సీరియల్స్లో నటించే తారలకు డ్రైవర్గా పనిచేయడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో అతనికి సుచిత్రతో పరిచయం పెరిగి, అది ప్రేమగా మారింది. ఆ ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇది అతనికి రెండో పెళ్లి కావడం ఇక్కడ గమనార్హం. గత ఐదు నెలలుగా కరోనా మహమ్మారి కారణంగా ఇద్దరికీ ఉపాధి కరువవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో చెన్నైలో ఉండటం భారంగా మారింది.
సుచిత్రను తీసుకొని తన స్వస్థలానికి వెళ్లిన మణికందన్.. ఆమెను తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. వారు ఆమెను తమ కుటుంబంలోకి మనసారా ఆహ్వానించారు. అక్కడ నగలు, డబ్బు చూసినప్పట్నుంచీ తన అత్తగారింటిని దోచుకోవాలని ప్లాన్ చేసిన ఆమె, అందుకు మణికందన్ను కూడా ఒప్పించింది. ఆ డబ్బుతో ఓ షార్ట్ ఫిల్మ్ తీసి, యూట్యూబ్లో ప్రమోట్ చేసి, తద్వారా డబ్బు, పేరు సంపాదించాలని వారు ప్లాన్ చేశారు. తమ ప్రణాళికలో భాగంగా చెన్నైలో తనకు పర్సనల్ వర్క్ ఉందని చెప్పి అత్తగారింటి నుంచి వెళ్లిపోయింది సుచిత్ర. కొద్ది రోజుల తర్వాత తన ఇంట్లోనే నగలు, నగదు దొంగిలించిన మణికందన్ కూడా సుచిత్ర దగ్గరకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు.
ఇంట్లో నగలు, డబ్బు మాయమయ్యాయని గుర్తించిన మణికందన్ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో తమ కుమారుడిపైనే అనుమానాలున్నట్లు వారు పేర్కొన్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మణికందన్ను పట్టుకున్నారు. సుచిత్ర పరారీలో ఉంది.
Also Read