సంఖ్యా బలమే... సక్సెస్లు అంతంత మాత్రమే
on Dec 31, 2018
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంఖ్యా పరంగా చాలా చిత్రాలే విడుదలైనా... సక్సెస్ రేట్ పరంగా మాత్రం చాలా అంటే చాలా తక్కువే అని చెప్పాలి. మొత్తం 165 నుంచి 170 కి పైగా స్ట్రెయిట్ చిత్రాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని అద్భుత విజయాలు, కొన్ని అనూహ్యమైన పరాజయాలు, కొన్ని బ్లాక్బస్టర్ చిత్రాలు, మరికొన్ని మంచి రెవిన్యూ తెచ్చిన చిత్రాలు, ఇంకొన్ని విమర్శకు ప్రశంసలు అందుకున్న చిత్రాలు మాత్రం మొత్తం కలిపితే 15 నుంచి 20 చిత్రాలుంటాయి. ఒకసారి 2018 మూవీ రివ్యూలోకి వెళితే...
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ సక్సెస్తో 2018 సంవత్సరం ప్రారంభమైంది. ఆ తర్వాత అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం విడుదలై సక్సెస్ సాధించింది. జనవరిలోనే విడుదలైన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం మాత్రం అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇక నూతన దర్శకుల వెంకీ కుడుమ ‘ఛలో’, వెంకీ అట్లూరి ‘తొలి ప్రేమ’ , చిత్రాల మంచి విజయాన్ని అందుకుని తెలుగు సినిమాకు మంచి ఊపునిచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది భారీ చిత్రాలతో పాటుగా అనేక లో- బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఒకవైపు స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ విజయాన్ని చేజిక్కించుకున్నట్టుగానే చిన్న సినిమాలు సైతం ప్రేక్షకాదరణ పొందాయి. చాలా దశాబ్దాలుగా తెలుగు సినిమా మూస పద్దతిలోనే సినిమాలు తీస్తోందనే విమర్శలున్నాయి. ఈ ఏడాది ఈ మూస పద్దతి నుండి కొంత పక్కకి జరిగినట్టు కనిపిస్తోంది. సక్సెస్తో సంబంధం లేకుండా చూస్తే వైవిధ్యం కొన్ని సినిమాల్లో కనిపించింది. వాటిలో కొన్ని ప్రేక్షకులును ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది చిన్న చిత్రాలు ఎక్కువగా విడుదలై అందులో కొన్ని అనూహ్యమైన విజయం సాధించాయి. పెద్ద సినిమా విషయానికి వస్తే 2018లో టాప్గ్రాసర్గా ‘రంగస్థలం ’నిలిస్తే, తక్కువ వ్యయంతో నిర్మించి, ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా ‘గీత గోవిందం’ సంచలనం సృష్టించింది. అంతేకాదు ఎక్కువ మంది చూసిన చిత్రంగా కూడా సంచలనం సృష్టించింది. భారీ బడ్జెట్ చిత్రాలకు రంగస్థలం, చిన్న బడ్జెట్ చిత్రాలకు గీతగోవిందం విజయాల స్ఫూర్తిని కలిగించాయని చెప్పవచ్చు. అగ్రహీరోలు సైతం ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ముందుకురావడం విశేషం. మహేష్బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా కూడా ఇలాంటి ప్రయోగ చిత్రాల కోవలోకి వస్తుంది. హీరోయిజం అనే గీత దాటకుండా చేసిన ఈ సినిమాను ఆదరించారు. మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగులో వచ్చిన లేటెస్ట్ బయోపిక్ ఇది. పైగా చాలామందికి తెలిసిన సావిత్రి కథని కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించారు. ప్రధాన కథని పక్కదారి పట్టించకుండా, వివాదాలకు తావు ఇవ్వకుండా మలచడంతో సక్సెస్ సాధించాడు. కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండతో పాటుగా అనేక మంది సీనియర్ నటీనటులు ఈ సినిమాలో నటించి మెప్పించారు. మహానటి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సినిమాలు చూడటం మానేసిన పాతతరం ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించింది. రెవిన్యూ పరంగా కూడా మంచి విజయాన్ని తెచ్చిపెట్టి, నిర్మాతలకు భరోసా కలిగించింది.