ENGLISH | TELUGU  

వారికి చెక్ పెట్టాలంటే... మార్గం అదే!

on Aug 18, 2017

సాహిత్యం అర్థం కాకాపోయినా ఫర్లా.. వినడానికి గమ్మత్తుగా ఉంటే చాలు పాట హిట్. 

తెలుగు రాకపోయినా పర్లా... వాయిస్ హస్కీగా ఉంటే చాలు.. డబ్బింగ్ హిట్...

చూడ్డానికి నార్త్ ఇండియన్ లా కనిపించినా పర్లా... చేతల్లో కొత్తదనం ఉంటే చాలు.. కేరక్టర్ హిట్. 

ప్రస్తుతం సినిమా పోకడ ఇలా ఉంది. అయితే... ఇది దర్శకులు తప్పు కాదు.  ప్రేక్షకుల టేస్టే అలా ఉంది. కేవలం సౌండింగ్ కొత్తగా ఉండటం వల్ల పాటలు హిట్స్ అవుతున్న రోజులివి. కేరక్టర్ల పరంగా కూడా అంతే కదా..! 

‘కథ రిత్యా హీరోహీరోయిన్లు తెలుగువాళ్లు కాబట్టి... వారి తండ్రులు కూడా తెలుగువాళ్లే’.. అని తెరపై వాళ్లను చూసి మనం అనుకోవాలి. నిజానికి చూడగానే... వారు నార్త్ ఇండియన్లని అర్థమైపోతుంది. కానీ... సినిమాకెళ్లినప్పుడు వాళ్లు తెలుగువారే అని మనం మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఈ విధంగా విచిత్రంగా తయారయ్యారు ప్రేక్షకులు. సయాజీ షిండే, సచిన్ ఖేడేకర్, మురళీశర్మ, ముఖేష్ రుషి... వీరందరినీ మనం వెండితెర తండ్రులుగా ఒప్పుకున్నాం అంటే.. అలా ఆత్మవంచన చేసుకోబట్టే కదా. ఇప్పుడు జనాలకు కావాల్సింది... చూడగానే కంటికి ఆనడం. పెర్ ఫార్మెన్స్ లో ఫ్రెష్ నెస్... అంతే. ప్రేక్షకుల బట్టే దర్శకులు కూడా. అంతేతప్ప వారి నుంచి అద్భుతమైన అభినయాన్ని ఆశించి కాదు. 


ఈ విషయంపై నటుడు కోట శ్రీనివాసరావు పలు సందర్భంలో ఘాటుగా స్పందించారు కూడా. తెలుగు రాని వారినీ, నటన చేతకాని వారినీ ఎందుకు ముంబయ్ నుంచి మరీ పిలిపిస్తారు? ఇక్కడ లేరా? అనేది ఆయన వాదన. ప్రస్తుతం జనాల అభిరుచి ప్రకారం చూస్తే కోట వాదనని కూడా కరెక్ట్ అనలేం. తన హయాంలో ఇలాంటి పాత్రలతో వీరవిహారం చేశారు కోట. కానీ.. ఆయన స్థాయి నటులు ఇప్పుడు లేరు. ఎడారిలో ఒయాసీస్సులా ఒకే ఒక్క రావు రమేశ్ మాత్రం కనిపిస్తున్నాడు. అతని ఒక్కడితో బండి లాగించడం కష్టం కదా. ఇక ప్రకాశ్ రాజ్ విషయంలో శత కోటి తల నొప్పులు. కాబట్టి... ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పిన సమయానికి వచ్చి.. క్రమశిక్షణగా చెప్పిన పని చేసుకుపోయేది ఆ నార్త్ ఇండియన్లే. జనాలు కూడా అలాంటి పర్సనాలిటీలనే ప్రధాన పాత్రలుగా ఒప్పుకుంటున్నారు. దాంతో మన దర్శకులకు తప్పడంలేదు. 

ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. షీయాజీ షిండే, మురళీశర్మ, ముఖేష్ రుషి, సచిన్ ఖేడేకర్.. వీళ్లందరూ గతంలో తెరపై దారుణమైన విలన్లుగా కనిపించిన వారే. అలాంటి వారే తండ్రి పాత్రలకు వచ్చేసరికి తమలో ఏ మాత్రం క్రౌర్యం కనిపించనీయకుండా అద్భుతంగా చేసి మెప్పించారు... మెప్పిస్తున్నారు కూడా. ఉదాహరణకు ‘ఒక్కడు’లో ముఖేష్ రుషి, ‘పోకిరి’లో షీయాజీ షిండే, ‘భలే భలే మగాడోవోయ్’లో మురళీశర్మ, ‘నేను లోకల్’లో సచిన్ ఖేడేకర్. ఈ సినిమాల్లో వారి నటనలో తండ్రులే కనిపించారు తప్ప ప్రతినాయక పోకడలు ఎక్కడా కనిపించలేదు. అందుకే ఈ విషయంలో వారి ప్రతిభను కూడా తప్పు పట్టలేం. 

హీరోహీరోయిన్లు ఎలాగూ తెరపై కలర్ ఫుల్ గా ఉంటారు. వీరితోపాటు... మిగిలిన పాత్రలు కూడా కలర్ ఫుల్ గా ఉండేలా చూసుకుంటున్నారు దర్శకులు. ముంబాయ్ దిగుమతులకు కారణం అదే. ఇలా కాదూ... తెలుగువారితోనే తండ్రుల పాత్రలు చేయించాలి... ప్రేక్షకులు మెచ్చే స్థాయిలో ఆ పాత్రలు ఉండాలీ.. అంటే అవి కేవలం గొంతెమ్మ కోర్కెలే అవుతాయ్. ఎందుకంటే.. ఆ ఫిజిక్, తెరపై ఆ యాటిట్యూడ్.. ఇవన్నీ తెలుగువారికి కష్టమే అని చెప్పాలి. 


అయినా.. తెలుగువారే చేయాలి అనుకుంటే... మన పాత స్టార్ హీరోలు తండ్రులుగా మారడం తప్ప వేరే మార్గం లేదు. ప్రస్తుతం జగపతిబాబు కేరక్టర్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి.. కొంతవరకూ వీరి స్పీడ్ కి బ్రేకులేశాడు. రాజశేఖర్ లాంటి టాప్ స్టార్ కూడా కేరక్టర్ యాక్టర్ గా టర్న్ అయ్యాడంటే... వీరిద్దరితో పాటు రావు రమేశ్ ఎలాగూ ఉంటాడు కాబట్టి...  ఉత్తరాది తండ్రులు స్పీడ్ కి శాశ్వతంగా బ్రేకులు పడతాయనేది పలువురి సినీ ప్రముఖుల అభిప్రాయం. 

మీరేం అంటారు ఫ్రెండ్స్? 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.