ఆ గ్రూపులకి చెక్ పెట్టాలి.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!
on Aug 7, 2025

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కార్మిక సంఘాలు వర్సెస్ నిర్మాతలు అన్నట్టుగా పరిస్థితి ఉంది. సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్స్ లో పాల్గొనేది లేదని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. అయితే నిర్మాతలు మాత్రం అంత మొత్తం పెంచడానికి సిద్ధంగా లేరు. ఈ విషయంపై కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. బయట వర్కర్స్ తో షూటింగ్ చేయడానికి కొందరు సిద్ధపడటం, దీంతో యూనియన్లు గొడవ చేయడం వంటివి జరిగాయి. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. లోకల్ టాలెంట్ను తక్కువగా చేస్తూ విమర్శలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన విశ్వప్రసాద్.. తన విమర్శలు వ్యవస్థపై మాత్రమేనని, ప్రతిభపై కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.
"హైదరాబాద్లో అపారమైన ప్రతిభ ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సుమారు 60% నుండి 70% వరకు పని చేసే బృందం హైదరాబాద్ నుంచే వస్తోంది.
గతంలో 10% ఉన్న స్కిల్ గ్యాప్ ఇప్పుడు 40% దాకా పెరగడం కేవలం ప్రతిభ ఒక్కటే లేకపోవడం కాదు. అసలు కారణం కొత్త టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పరిశ్రమలోకి రానివ్వకుండా రూ.5-7 లక్షల వరకు అక్రమంగా డిమాండ్ చేసే గ్రూపుల వల్ల. నిజమైన టాలెంట్, స్కిల్ ఉన్న వాళ్లకు ఇది ప్రధానమైన అడ్డంకిగా నిలుస్తుంది.
ఇప్పటికే మేజార్టీ టీం హైదరాబాద్ నుంచే వస్తోంది. మిగిలిన గ్యాప్ కూడా ఇక్కడి ప్రతిభతోనే నింపాలి. నేను హైదరాబాద్ టాలెంట్ను తక్కువగా అంచనా వేస్తున్నానన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు.
హైదరాబాద్లో టెక్నీషియన్లు, ఆర్టిస్టులు తెలుగు సినిమాకు ఎప్పట్నుంచో అండగా ఉన్నారు. వాళ్లను అడ్డుకునే వ్యవస్థల్ని తొలగించాలి.. మెరిట్కు ప్రాధాన్యం ఇవ్వాలి.. స్థానిక ప్రతిభకు అవకాశాలు కల్పించాలి... వడ్డీల కోసమే ఉండే గ్రూపులను అడ్డుకోవడం మన బాధ్యత. ఇదే మన పరిశ్రమ భవిష్యత్తుకు అవసరం." అని విశ్వప్రసాద్ తెలిపారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



