'మా' ఎన్నికల్లో రౌడీయిజం జరిగింది.. మావాళ్లు 11 మంది రాజీనామా చేస్తున్నారు!
on Oct 12, 2021
అనుకున్నట్లుగానే 'మా' ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్రాజ్ ప్యానల్కు చెందిన 11 మంది మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారి తరపున ఆ విషయాన్ని ప్యానల్ లీడర్ ప్రకాశ్రాజ్ ప్రకటించారు. లేటెస్ట్గా ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తన ప్యానల్ మెంబర్స్తో కలిసి పాల్గొన్నారు ప్రకాశ్రాజ్. మా ఎన్నికల్లో రౌడీయిజం జరిగిందని తాజాగా ఆయన ఆరోపించారు. బెనర్జీ మీద చేయి చేసుకున్నారనీ, నరేశ్ ప్రవర్తన బాగా లేదనీ అన్నారు. ప్రెసిడెంట్గా గెలిచిన విష్ణు చాలా పెద్ద హామీలిచ్చారనీ, వాటిని అమలు చేయడంలో అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే గెలిచిన తమ ప్యానల్వారు రాజీనామా చేస్తున్నారనీ ఆయన చెప్పారు.
"ఎన్నో ఆశలతో, కలలతో చాలా తీవ్రంగా పోటీ చేశాం. రిజల్ట్స్ వచ్చాయి. మా ప్యానల్ నుంచి 11 మంది గెలిచారు. మిగిలిన వాళ్లు అవతలి ప్యానల్ వాళ్లు. కానీ ఈ రెండు మూడు రోజులుగా జరిగిన సంఘటనలపై అందరం కలిసి కూర్చొని చర్చించాం. 'మా' మంచి కోసం వచ్చాం. సభ్యులు ఎన్నుకున్నారు. మొదట్నుంచీ మనం ఏ ప్యానల్నైనా ఒకే ప్యానల్ను ఎన్నుకోండి అని చెప్పాం. క్రాస్ ఓటింగులు జరిగాయి. సగం మంది ఈ ప్యానల్ నుంచి, సగం మంది ఆ ప్యానల్ నుంచి ఎన్నుకున్నారు. మా ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు అందరం కలిసి మాట్లాడతాం అన్నారు. ఎలక్షన్ జరిగిన విధానం గురించి చర్చించాం. చాలా రౌడీయిజం జరిగింది. మాటల పోరు జరిగింది. పోస్టల్ బ్యాలెట్స్లో అన్యాయం జరిగింది. అయినా ఎలక్షన్ ఆపకూడదు, జరిగనియ్ చూద్దాం అనుకున్నాం." అని ప్రకాశ్రాజ్ తెలిపారు.
"ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి మనుషుల్ని తెచ్చారు. డీఆర్సీ చీఫ్గా ఉన్న మోహన్బాబు వచ్చి కూర్చున్నారు. ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు. కానీ క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి ఒక సీనియర్ నటుడి మీద చేయి చేసుకున్నారు. చాలా అసభ్య భాషను ఉపయోగించారు. నరేశ్గారి ప్రవర్తన కానీ.. ఆ తర్వాత రిజల్ట్స్ ఎనౌన్స్ చేశారు. ఆ రాత్రికి ఈసీ రిజల్ట్స్ మాత్రం పక్కన పెట్టారు. ఆ రాత్రి వెళ్లేటప్పుడు ఈసీలో మేం 11 మంది ఉన్నాం. మరుసటి రోజు పోస్టల్ బ్యాలెట్స్ కలపడానికి వారికి ఒక రోజు పట్టింది. సాయంత్రానికి ఆశ్చర్యకరంగా లెక్కలు మారాయి. ఈసీలో మీరు ఎనిమిది మందే అన్నారు. నిన్న గెలిచిన వాళ్లు ఈరోజు ఎందుకు ఓడిపోయారని ఆశ్చర్యపడ్డాం." అన్నారు.
"ఆ తర్వాత మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టారు. అందర్నీ కలుపుకొని వెళ్తానన్న మనిషి, జనరల్ సెక్రటరీ మావాడే, ట్రెజరర్ మావాడే, ఎవరడ్డొచ్చినా మాదే మెజారిటీ అనగానే.. ఆ మాటలకు చాలా బాధపడ్డాం. అది కలుపుకొని వెళ్లే విషయం కాదు. ఈరోజు మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఇలా మీరు, మేము అంటే కలిసి పనిచేయగలమా? ఇలా సగం, సంగం ప్యానల్ వస్తే.. మునుపటి రేండుళ్లు చూశాం.. పనిచేయలేకపోయారు. 'మా' మసకబారింది అనేవరకు వచ్చేసింది. మాకు కావాల్సింది అది కాదు. ఇలాంటి వాతావరణంలో మేం పనిచేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు." అని ప్రకాశ్రాజ్ తెలిపారు.
"'మా' సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయి, మళ్లీ గొడవల్లోనే మిగిలిపోతుందా? లేదా మా సంక్షేమం జరగకుండా ఉండటానికి కారణం.. అక్కడున్న మేం పందకొండుమంది ప్రశ్నించడం వల్లా? మనం ఒక డెసిషన్ తీసుకుంటామని అనుకున్నాం. ఆ నిర్ణయం.. వచ్చే రెండు సంవత్సరాలు విష్ణు మంచుగారు ప్రెసిడెంట్గా బాగా పనిచేయాలి. ఆయన పెద్ద పెద్ద హామీలిచ్చారు, మాటిచ్చారు. దానికి అడ్డు రాకూడదు. ఒకవేళ పనిలేకపోతే మామీద వేయకూడదు. అందువల్ల చాలా ఆలోచించిన మీదట మా సంక్షేమం కోసమే సినిమా బిడ్డలు ప్యానల్ నుంచి గెలుపొందిన 11 మంది.. శ్రీకాంత్, బెనర్జీ, ఉత్తేజ్, మిగతా ఈసీ మెంబర్స్.. అందరు మా పదవులకు రాజీనామా ఇస్తున్నారు. ఇది ఎమోషనల్ డెసిషన్ కాదు." అని ఆయన చెప్పారు.
"మీరు (విష్ణు) మీకు కావాల్సిన వారిని పెట్టుకొని ఫ్రీగా పనిచెయ్యండి. మేం బయట నుంచి చూస్తాం. 'మా' సభ్యుల సంక్షేమం చూస్తుంటాం. రేపు ఒకవేళ మీరు పనిచేయకపోతే, వాళ్ల తరపున ప్రశ్నిస్తాం. మీరు చేసే పనులకు అడ్డురాము. ఇదొక డిగ్నిఫైడ్ డెసిషన్. గొడవలొద్దు. ప్లీజ్ రన్ ద షో. మేం ప్రశ్నించడాన్ని కొనసాగిస్తాం. మాకూ ఈక్వల్గానే ఓట్లు వచ్చాయి. అక్కడ ఉండి పనిచేయడం కన్నా గొప్ప పని ఇది. ఓటేసిన మా ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకొనే పని చేస్తున్నాం. విష్ణుగారూ మా రాజీనామాను ఒప్పుకుంటారని ఆశిస్తున్నాం." అని ప్రకాశ్రాజ్ అన్నారు.
Also Read