దసరాకు 'వరుడు కావలెను'..!
on Sep 25, 2021
నాగశౌర్య-రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వరుడు కావలెను'. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న 'వరుడు కావలెను' చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో 'వరుడు కావలెను' చిత్రం మిమ్మల్ని అలరించటానికి మీముందుకు వస్తోంది. దసరా కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని చిత్ర దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో మురళీశర్మ, వెన్నెలకిషార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.