స్టైలిష్ స్టార్కి మళ్లీ శ్రీరామ్ సాంగ్ సిద్ధం
on Sep 25, 2021
సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రంలో క్రేజీ సింగర్ సిద్ శ్రీరామ్తో హీరో అల్లు అర్జున్కు ఓ పాట పాడించారని.. ఇది మంచి రొమాంటిక్ సాంగ్ అని.. ఈ సాంగ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మార్క్తో రికార్డు అయిందనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది. అయితే ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' మూవీలో సిద్ శ్రీరామ్ పాడిన "సామజవరగమన.." సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
అలాగే సిద్ గొంతు నుంచి జాలువారిన 'వకీల్ సాబ్'లోని "మగువా మగువా...", 'రంగ్ దే' చిత్రంలోని "నా కనులు ఎపుడూ...", తాజాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' చిత్రంలోని "లెహరాయి..." లాంటి సాంగ్స్తో ఆయనకు మరింత క్రేజ్ పెరిగింది. తమిళంలో కూడా సిద్ పాడిన పాటలు మంచి ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. దీంతో అతను తమిళ చిత్ర సీమలో కూడా దూసుకుపోతున్నాడు.
ఎర్రచందనం స్మగ్లింగ్ కథా కథనంతో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకోంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన "దాక్కో దాక్కో మేక..." సాంగ్ వ్యూస్పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే సిద్ శ్రీరామ్ సాంగ్ కూడా రికార్డు క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ముత్తంశెట్టి మీడియాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తుంది. ఈ చిత్రం మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఇది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్య', 'ఆర్య 2' చిత్రాలు మంచి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. తాజాగా 'పుష్ప' పై అల్లు అర్జున్ ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.