చిరంజీవిని ఈరోజుకీ నా స్నేహితుడిగా భావిస్తుంటాను.. మోహన్బాబు మాటల వెనుక ఆంతర్యం?
on Sep 23, 2021
కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు మార్క్ డైలాగ్స్, మాటలతో 'ఆలీతో సరదాగా' 250 ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. మాటలు వినిపించని తన తల్లి ఐదుగురు పిల్లల్ని ఎలా పెంచి పెద్దచేసిందనే సంగతుల నుండి... భక్తవత్సలం నాయుడు అయిన తనను మోహన్ బాబుగా దాసరి మార్చడం వరకు, ఆ తర్వాత సినీ పరిశ్రమలో అనుభవాలను అలీతో చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం మోహన్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'సన్నాఫ్ ఇండియా'. అందులో ఒక డైలాగును టాక్ షోలో వినిపించారు. 'ఒకమ్మాయిని లారీ క్లీనర్ రేప్ చేస్తే... వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. మనమంతా 'శెభాష్... శెభాష్' అని చప్పట్లు కొట్టి భుజాలు ఎగరేసుకుంటాం. అదే బడాబాబులు, వాళ్లకు పుట్టిన బుడ్డబాబులు రేప్ చేస్తే... 24 ఏళ్ళైనా న్యాయం జరగదు... జరగదు... దటీజ్ అవర్ ఇండియా' అని తనదైన శైలిలో మోహన్ బాబు చెప్పారు.
దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ కావచ్చు, తాజాగా సింగరేణి కాలనీ పాప ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య కావచ్చు... ప్రస్తుతం సమాజంలో పరిస్థితులకు 'సన్నాఫ్ ఇండియా'లో డైలాగ్ అద్దం పట్టేలా ఉంది.
చిరంజీవి ప్రస్తావన కూడా షోలో వచ్చింది. విద్యానికేతన్ సంస్థ గురించి మాట్లాడుతూ, "చిరంజీవిని ఈ రోజుకీ నా స్నేహితుడిగా భావిస్తుంటాను" అని అన్నారు. ఆయన మాటల వెనుక ఆంతర్యం ఏమిటో? అనే డిస్కషన్ ఆల్రెడీ ఇండస్ట్రీలో మొదలైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో విష్ణు మంచుకు కాకుండా ప్రకాష్ రాజ్ బృందానికి చిరంజీవి మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
Also Read