ముగిసిన ఈడీ విచారణ.. తరుణ్ పై ప్రశ్నల వర్షం!
on Sep 22, 2021
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో హీరో తరుణ్ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో హాజరయ్యాడు. దాదాపు 8 గంటలు పాటు ఈడీ అధికారులు తరుణ్ ను ప్రశ్నించారు. కెల్విన్ తో సంబంధాలు, బ్యాంక్ లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది.
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సినీ ప్రముఖులకు నోటిసులు ఇచ్చింది ఈడీ. ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, నవదీప్, నందు, తనీష్, ముమైత్ ఖాన్ లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక ఈరోజు తరుణ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బ్యాంక్ డాక్యుమెంట్స్ అడగడంతో.. తరుణ్ తో పాటు ఆయన తండ్రి చక్రపాణి కూడా విచారణకు హాజరయ్యారు. 2017 డ్రగ్స్ కేసులో తరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై తరుణ్ ను విచారించారని సమాచారం.
కాగా, నేటితో సినీతారల విచారణ ముగిసింది. పూరి జగన్నాథ్ తో ప్రారంభమైన ఈడీ విచారణ.. తరుణ్ తో ముగిసింది. ఇదిలా ఉంటే.. 2017 జూలై 19న తరుణ్ నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.
Also Read