బన్నీని చూసి అసూయ కలిగింది: మంచు విష్ణు
on Oct 20, 2021
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. బన్నీ తనకు మంచి మిత్రుడని, బన్నీని చూసి తనకు అసూయ కలిగిందని అన్నారు.
బన్నీ తనకు మంచి మిత్రుడని, ఇద్దరం రెగ్యులర్గా చాటింగ్ చేసుకుంటూ ఉంటామని విష్ణు తెలిపారు. బన్నీ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప' పార్ట్-1 డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. అదే టైంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్ధా' కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ కు చెందిన పలు మ్యాగజైన్స్, వార్త పత్రికలు.. ఆమిర్ ఖాన్ కు అల్లు అర్జున్ పోటీ ఇవ్వబోతున్నాడని రాశాయి. అది చూసి బన్నీ అంటే అసూయ కలిగిందని, అదే సమయంలో ఓ తెలుగు హీరోగా బన్నీని చూసి గర్వపడ్డానని విష్ణు అన్నారు. అలాగే, పుష్ప మూవీ మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని విష్ణు పేర్కొన్నారు.
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ 17న విడుదల కానుంది.
Also Read