2020 పోటీలో గెలిచేది ఎవరు..?
on Jul 11, 2019
సంక్రాంతికి థియేటర్లలో కోడి పందాలు ఫేమస్. థియేటర్లలో విడుదలయ్యే కొత్త సినిమాలు కూడా! బరిలో దిగే కోడి పుంజుల్లో ఏది నెగ్గుతుందోనని చుట్టూ గుమిగూడిన ప్రజలు ఎదురు చూసినట్టు, సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో ఏది హిట్టవుతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. విడుదల తర్వాత థియేటర్లలో ఉండాల్సిన పోటీ... మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాల మధ్య విడుదలకు ముందు నెలకొందని ఫిలింనగర్ టాక్. రీసెంట్గా కాశ్మీర్లో 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ మొదలైంది. మేజర్ అజయ్ కృష్ణ క్యారెక్టర్లో మహేష్ నటిస్తున్నాడని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. దాంతో పాటు వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. కాసేపటికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ టీమ్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. తమ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుందని. ఇద్దరు హీరోలూ ముందు నుంచి సంక్రాంతి సీజన్పై కర్చీఫ్ వేస్తున్నారు. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఈ రెండింటితో పాటు శర్వానంద్ 'శ్రీకారం' కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. సాయిధరమ్ తేజ్, మారుతి చిత్రాన్నీ సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నప్పటికీ.. అల్లు అర్జున్ సినిమా వస్తే ముందుకో, వెనక్కో వెళుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలను పరిశీలిస్తే... ప్రస్తుతానికి ప్రధానంగా మహేష్, బన్నీ మధ్య పోటీ నెలకొంది.