ఎనిమిదేళ్ల తర్వాత వచ్చాడు.. నచ్చకుండాపోయాడు!
on Oct 14, 2021
సిద్ధార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసి ఎనిమిదేళ్ల గడిచిపోయాయి. నందినీరెడ్డి డైరెక్షన్లో చివరిసారిగా 'జబర్దస్త్' (2013) మూవీ చేశాడు. అది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇన్నేళ్ల తర్వాత తెలుగులో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంటే కచ్చితంగా అందులో విషయం ఉండి ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎలాంటి క్యారెక్టర్తో అతను ఇంత విరామం తర్వాత తమ ముందుకు వస్తున్నాడా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. 'మహాసముద్రం' వచ్చింది. అందులో విజయ్ క్యారెక్టర్నూ, ఆ క్యారెక్టర్లో సిద్ధార్థ్నూ చూసినవాళ్లు పెదవి విరిచేశారు. ఈ పాత్రను సిద్ధార్థ్ ఎలా ఒప్పుకున్నాడబ్బా అని ఆశ్చర్యపోయారు.
ఎస్సై అయ్యి, స్మగ్లర్స్తో చేతులు కలిపి, దండిగా డబ్బులు సంపాదించాలనే కరప్టెడ్ మైండ్తో ఉండే కన్నింగ్ క్యారెక్టర్లో దర్శనమిచ్చాడు సిద్ధార్థ్. హీరోయిన్ మహా (అదితి రావ్ హైదరి)ని ప్రేమించి, ఆమె దగ్గర డబ్బులు తీసుకుంటూ, ఆమెను శారీరకంగా కలిసిన తర్వాత, ఆమెను వదిలేసి వెళ్లిపోయే పాత్రలో అతడిని చూసి నిరాశ చెందారు జనం. నటుడిగా సిద్ధార్థ్ను తక్కువ చెయ్యలేం. కానీ విజయ్ పాత్రను డైరెక్టర్ అజయ్ భూపతి మలచిన తీరు వల్లనేమో.. ఆ పాత్రకు సిద్ధార్థ్ నప్పలేదనే అభిప్రాయం కలుగుతుంది. నెగటివ్ నుంచి పాజిటివ్గా విజయ్ మారే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, అవి కన్విన్సింగ్గా లేవు. కన్నింగ్ ఫెలో అయిన విజయ్.. చుంచుమామ (జగపతిబాబు) చెప్పిన నిజాలు విని, మంచివాడిగా మారిపోతాడా? చెడ్డవాడు మంచివాడుగా మారతాడేమో కానీ, మోసగాడు మంచివాడిగా మారడం జరగదు.
ఓవైపు మహా తెచ్చే డబ్బులను ఆత్రంగా తీసుకుంటూనే, ఆమెను వదిలించుకోవాలన్నట్లు బిహేవ్ చేస్తుంటాడు విజయ్. ఆమె పెళ్లి చేసుకుందామని అన్నప్పుడల్లా చిరాకు పడుతుంటాడు. ఉత్త పుణ్యానికి ఆమెను కొడతాడు. వర్షం పడుతున్న రాత్రి తనతో పాటు రావడానికి ఇల్లు విడిచి వచ్చిన ఆమెను నిర్దయగా వదిలేసి వెళ్లిపోతాడు. అలాంటి క్యారెక్టర్లో సిద్ధార్థ్ను చూడ్డానికి కష్టమేసింది. ఆ పాత్రకు విషాదంతో ముగింపు ఇచ్చినా, అది ప్రేక్షకుల సానుభూతికి నోచుకోకపోవడం అసలైన విషాదం. ఎనిమదేళ్ల తర్వాత నేరుగా విజయ్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధార్థ్ నచ్చలేదు.
Also Read