ఓటీటీ బాటలో కృష్ణవంశీ `రంగమార్తాండ`!
on Sep 22, 2021
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సక్సెస్ చూసి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో `చందమామ`(2007)తో చివరిసారిగా హిట్ కొట్టారాయన. ఆ తరువాత వచ్చిన సినిమాలేవీ కమర్షియల్ గా మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు ఈ వెటరన్ కెప్టెన్.
ప్రస్తుతం కృష్ణవంశీ `రంగమార్తాండ` పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. మరాఠీ క్లాసిక్ `నటసామ్రాట్`(2016) ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. మాతృకలో నానా పటేకర్ పోషించిన పాత్రలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా.. ఇతర కీలక వేషాల్లో రమ్యకృష్ణ, అనసూయ దర్శనమివ్వనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని జనం ముందుకు తీసుకువచ్చే ఆలోచనతో ఉన్నట్లు తాజాగా కృష్ణవంశీ తెలిపారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `రంగమార్తాండ`ని థియేటర్స్ లో కాకుండా ఓ ప్రముఖ ఓటీటీ వేదికలో నేరుగా స్ట్రీమ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. ఈ చిత్రంతోనైనా కృష్ణవంశీ తన అభిమానులను పూర్తిస్థాయిలో మురిపిస్తారేమో చూడాలి.