తాప్సీ.. ఓటీటీలో ముచ్చటగా మూడో సినిమా!
on Sep 22, 2021
హిందీనాట ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది తాప్సీ. అంతేకాదు.. అవకాశం దొరికినప్పుడల్లా తమిళ, తెలుగు భాషల్లోనూ నటిస్తూ మురిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఇప్పటివరకు రెండు చిత్రాలతో పలకరించిన తాప్సీ.. ఇప్పుడు మూడో సినిమాతో సందడికి సిద్ధమైంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గత రెండు సినిమాల తరహాలో ఇది కూడా ఓటీటీ వేదికగా రిలీజ్ కానుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం `హసీన్ దిల్ రుబా` ఈ ఏడాది జూలై 2న ప్రముఖ ఓటీటీ వేదిక `నెట్ ఫ్లిక్స్`లో స్ట్రీమ్ అయింది. ఇక ఈ నెల 17న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి తాప్సీ నటించిన తమిళ చిత్రం `అనాబెల్ సేతుపతి`.. మరో ఓటీటీ వేదిక `డిస్నీ ప్లస్ హాట్ స్టార్`లో ఇతర దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి స్ట్రీమ్ అయింది. కట్ చేస్తే.. వచ్చే నెల 15న తాప్సీ మెయిన్ లీడ్ గా నటించిన హిందీ సినిమా `రష్మీ రాకెట్` `జీ5` ఓటీటీ వేదికలో స్ట్రీమ్ కానుంది. మొత్తమ్మీద.. 2021 సెకండాఫ్ లో తాప్సీ నటించిన మూడు వరుస చిత్రాలు మూడు వేర్వేరు ఓటీటీ వేదికలను టార్గెట్ చేశాయన్నమాట.
మరి.. గత రెండు చిత్రాలు నిరాశపరిచిన నేపథ్యంలో.. `రష్మీ రాకెట్` అయినా తాప్సీకి మంచి ఫలితాన్ని అందిస్తుందేమో చూడాలి.