అప్పుడు 'మిర్చి'.. ఇప్పుడు 'ఆచార్య'!
on Oct 12, 2021
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న దర్శకుల్లో విజనరీ డైరెక్టర్ కొరటాల శివ ఒకరు. `మిర్చి`, `శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `భరత్ అనే నేను`.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తెలుగునాట కెప్టెన్ గా తనదైన ముద్ర వేశారు శివ. త్వరలో ఈ స్టార్ డైరెక్టర్.. మరో క్రేజీ ప్రాజెక్ట్ తో పలకరించబోతున్నారు. ఆ సినిమానే.. `ఆచార్య`. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. `ఆచార్య`ని 2022 ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్లు తాజాగా యూనిట్ ప్రకటించింది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అన్ సీజన్ గా భావించే ఫిబ్రవరి నెలలోనే కొరటాల ఫస్ట్ డైరెక్టోరియల్ `మిర్చి` విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసింది. 2013 ఫిబ్రవరి 8న రిలీజైన `మిర్చి`.. ఆ యేటి మేటి విజయాల్లో ఒకటిగా నిలిచింది. మరి.. `మిర్చి` తరహాలో `ఆచార్య`కూడా ఫిబ్రవరి సెన్సేషన్ గా నిలిచి.. కొరటాల శివ ఖాతాలో మరో మెమరబుల్ మూవీ అవుతుందేమో చూడాలి.
కాగా, `ఆచార్య`లో చిరుకి జంటగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటించగా.. ప్రకాశ్ రాజ్, సోనూ సూద్, జిషు సేన్ గుప్తా, సంగీత ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. రెజీనా ఓ ప్రత్యేక గీతంలో తళుక్కున మెరవనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చిన `ఆచార్య`కి తిరు ఛాయాగ్రహణం అందించారు.