విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలనుంది
on Oct 13, 2021
అక్కినేని వారసుడిగా 'అఖిల్' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ మొదటి మూడు సినిమాలతో(అఖిల్, హలో, మిస్టర్ మజ్ను) నిరాశ పరిచాడు. ఫస్ట్ హిట్ కోసం తపిస్తున్న ఈ అక్కినేని హీరో.. త్వరలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ హ్యాండ్సమ్ హీరోకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉందట.
అఖిల్, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. దసరా కానుకగా ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొంటున్న అఖిల్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కే బయోపిక్ సినిమాల్లో నటించాలని ఉందన్నాడు. ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ హీరోగా కపిల్ దేవ్ జీవితంపై తెరకెక్కుతున్న '83' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. అలాగే విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉందని అఖిల్ తన మనసులోని మాట బయటపెట్టాడు.
ఎంతో మంది జీవితాలను కోహ్లీ ప్రభావితం చేశాడని.. అతడి బయోపిక్ తీస్తే బాగుంటుందని అఖిల్ అన్నాడు. క్రికెట్ మీద అతడికున్న ప్యాషన్ తో సినిమా తీస్తే చాలా అగ్రెసివ్ గా ఉంటుందని.. అందులో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అఖిల్ మంచి క్రికెట్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో క్రికెటర్ గా సత్తా చాటాడు. మరి కోహ్లీ బయోపిక్ లో నటించాలన్న అఖిల్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.