ఈ టాలెంటెడ్ డైరెక్టర్స్ కి ఏమైంది? ఎక్కడున్నారు?
on Mar 18, 2025
గత పదేళ్లలో టాలీవుడ్ కి ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్స్ పరిచయమయ్యారు. భవిష్యత్ లో వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారని.. మొదటి సినిమాతోనే నమ్మకం కలిగించారు. కానీ, ఆ నమ్మకాన్ని చాలా మంది నిలబెట్టుకోలేకపోతున్నారు. మొదటి చిత్రంతో తమ ప్రతిభను చాటుకొని.. ఆ తర్వాత ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుంటూ సైలెంట్ అవుతున్నారు. అసలు ఈ టాలెంటెడ్ డైరెక్టర్స్ కి ఏమైంది? ఎక్కడున్నారు? ఎందుకు పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు? అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.
2016 లో వచ్చిన 'క్షణం'తో పరిచయమై.. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు రవికాంత్ పెరేపు. ఆ తర్వాత ఈ తొమ్మిది సంవత్సరాలలో ఆయన డైరెక్షన్ లో 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'బబుల్గమ్' సినిమాలు మాత్రమే వచ్చాయి. మధ్యలో ఎడిటర్ గా కొన్ని సినిమాలు చేశాడు. ప్రస్తుతం దర్శకుడిగా సిద్ధు జొన్నలగడ్డతో 'కోహినూర్' చేస్తున్నాడు.
2016 లో విడుదలైన 'పెళ్ళి చూపులు'తో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు తరుణ్ భాస్కర్. రొమాంటిక్ కామెడీ సినిమాలలో సరికొత్త ట్రెండ్ ని సెట్ చేస్తూ.. పెళ్ళి చూపులు ఘన విజయం సాధించింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి స్టార్స్ సైతం ఆసక్తి చూపించారు. కానీ, తరుణ్ మాత్రం.. 'పెళ్ళి చూపులు' తర్వాత ఈ తొమ్మిదేళ్లలో 'ఈ నగరానికి ఏమైంది', 'కీడా కోలా' అనే రెండు సినిమాలే డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ గా కంటే, యాక్టర్ గానే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు తరుణ్.
2017లో 'ఘాజీ' అనే వైవిద్యభరితమైన చిత్రంతో పరిచయమై.. ప్రామిసింగ్ డైరెక్టర్ గా కనిపించాడు సంకల్ప్ రెడ్డి. కానీ డైరెక్టర్ గా అతని అడుగులు మాత్రం నెమ్మదిగా ఉన్నాయి. 'ఘాజీ' తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాలలో 'అంతరిక్షం' అనే ఒక తెలుగు సినిమా, 'IB 71' అనే ఒక హిందీ సినిమా మాత్రం చేశాడు. ఇటీవల గోపీచంద్ తో ఓ సినిమాని ప్రకటించాడు. ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు.
'అరెరే' చిత్రంతో మొదటిసారి మెగాఫోన్ పట్టిన శశికిరణ్ తిక్కా.. 2018లో వచ్చిన 'గూఢచారి'తో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ, 'గూఢచారి' తర్వాత ఈ ఏడేళ్లలో శశికిరణ్ డైరెక్షన్ లో 'మేజర్' అనే ఒకే ఒక సినిమా వచ్చింది. 2024 లో వచ్చిన 'సత్యభామ' చిత్రానికి రచయితగా, నిర్మాతగా వ్యవహరించాడు.
2018లో విడుదలైన 'కేరాఫ్ కంచరపాలెం' వంటి క్లాసిక్ ఫిల్మ్ తో.. డైరెక్టర్ వెంకటేష్ మహా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ తర్వాత ఈ ఏడేళ్లలో వెంకటేష్ మహా డైరెక్షన్ లో 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' అనే ఒక్క సినిమా మాత్రమే వచ్చింది. దర్శకుడిగా మూడో సినిమాగా 'మర్మాణువు'ని ప్రకటించాడు. కానీ, అది ఎంతవరకు వచ్చిందో తెలీదు. వెంకటేష్ మహా కూడా డైరెక్టర్ గా కంటే, యాక్టర్ గానే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు.
2018లో రిలీజ్ అయిన 'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా పరిచమయ్యాడు వేణు ఊడుగుల. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది. దీంతో దర్శకుడిగా వేణు.. మరిన్ని మంచి సినిమాలు చేస్తాడని అందరూ భావించారు. కానీ ఈ ఏడేళ్లలో వేణు దర్శకత్వంలో 'విరాట పర్వం' అనే ఒకే ఒక చిత్రం వచ్చింది. డైరెక్టర్ గా వేణు మూడో చిత్రం ఫలానా స్టార్ తో ఉంటుందని పలువురి పేర్లు వినిపించాయి కానీ, ఏదీ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం నిర్మాతగా మారి ఈటీవీ విన్ తో కలిసి 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమాని నిర్మించాడు వేణు.
'మధురం' వంటి క్లాసిక్ షార్ట్ ఫిల్మ్ తో సంచలనం సృష్టించిన ఫణీంద్ర నర్సెట్టి.. 2018లో వచ్చిన 'మను' సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'మను'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఫణీంద్ర.. రెండో సినిమా కోసం దాదాపు ఏడు సంవత్సరాల సమయం తీసుకున్నాడు. త్వరలో తాను డైరెక్ట్ చేసిన రెండో సినిమా '8 వసంతాలు'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
2019 లో విడుదలైన 'రాజా వారు రాణి గారు' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవికిరణ్ కోలా.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు దాటిపోయింది.. కానీ, రవికిరణ్ దర్శకత్వంలో రెండో సినిమా రాలేదు. మధ్యలో 'అశోకవనంలో అర్జున కల్యాణం' చిత్రానికి రచయితగా పనిచేశాడు. డైరెక్టర్ గా రెండో సినిమాని.. విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్దన్'గా చేస్తున్నాడు. ఇది రావడానికి కనీసం ఏడాది పడుతుంది.
2020లో నేరుగా ఓటీటీలో విడుదలైన 'కలర్ ఫోటో'తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రాజ్. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సినిమాతో దర్శకుడిగా సందీప్ రాజ్ ఎంతో పేరు సంపాదించుకున్నాడు. అయితే 'కలర్ ఫోటో' వచ్చి ఐదేళ్లవుతున్నా సందీప్ డైరెక్షన్ లో రెండో సినిమా రాలేదు. ప్రస్తుతం 'మోగ్లీ' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ కూడా డైరెక్టర్ గా కంటే, యాక్టర్ గానే ఎక్కువ బిజీగా ఉన్నాడు.
టాలీవుడ్ లో ఇలా ఎందరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్.. ఒకట్రెండు సినిమాలతో మెరిపించి.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కొందరేమో చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా మోజులో పడిన హీరోలు.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్స్ ను పట్టించుకోవట్లేదా? లేక ఈ దర్శకులే కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారో? అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఇలాంటి ప్రతిభగల దర్శకులు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేస్తే.. తెలుగు ప్రేక్షకులకు మరిన్ని మంచి సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
