రవితేజతో త్రిష... దర్శకుడి మాటేమిటి?
on Apr 24, 2020
మాస్ మహారాజ్ రవితేజ, చెన్నై ముద్దుగుమ్మ త్రిషది హిట్ కాంబినేషన్. పన్నెండేళ్ల క్రితం వాళ్లిద్దరూ 'కృష్ణ' చిత్రంలో జంటగా నటించారు. తర్వాత మరో చిత్రం చేయలేదు. మళ్లీ వీళ్లిద్దరినీ దర్శకుడు రమేష్ వర్మ తెర మీదకు తీసుకొస్తున్నారనే వార్త వినిపించింది.
రవితేజ హీరోగా కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రమేష్ వర్మ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు, తొమ్మిదేళ్ల క్రితం రవితేజతో 'వీర' తీశారు రమేష్ వర్మ పెన్మత్స. అది ఆశించిన విజయం సాధించలేదు. ఈసారి భారీ విజయం అందుకోవాలని బలమైన సంకల్పంతో ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయింది. నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఈ సినిమాలో రవితేజ సరసన త్రిష నాయికగా నటించనుందని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదే మాట ఆయన్ను అడిగితే "మార్చిలో కాస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాం. ఈలోపు లోక్ డౌన్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి నటీనటుల ఎంపికను పక్కన పెట్టాం. నిజం చెప్పాలంటే... చాలాపేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసి మా నిర్మాత ఆశ్చర్యపోతున్నారు. రవితేజగారిని తప్ప మరో యాక్టర్ ఎవరూ మా సినిమాలో లేదు. ఒక్కసారి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక మేమే చెబుతాం" అని అన్నారు.