రష్మిక మరో ఘనత.. ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానం!
on Oct 18, 2021
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా మరో ఘనత సాధించింది. ఫోర్బ్స్ ' సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంతమైన సౌత్ ఇండియా నటుల' జాబితాలో నటి రష్మిక అగ్రస్థానం సంపాదించుకుంది. ఎందరో స్టార్స్ ని వెనక్కి నెట్టి రష్మిక అగ్ర స్థానంలో నిలవడం విశేషం.
కన్నడ మూవీ కిరిక్ పార్టీ(2016)తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మిషన్ మజ్ను, గుడ్ బై వంటి సినిమాలతో బాలీవుడ్ లోనూ అడుగు పెడుతున్న ఈ అమ్మడు నేషనల్ క్రష్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఫోర్బ్స్ 'సోషల్ మీడియాలో అత్యంత ప్రభావవంతమైన నటుల' జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. విజయ్ దేవరకొండ, సమంత, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్స్ ని వెనక్కి నెట్టి రష్మిక అగ్ర స్థానం దక్కించుకుంది.
సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు సోషల్ మీడియాలో పెరిగిన ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్, వ్యూస్ వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఈ జాబితాని తయారు చేస్తారు. ఇందులో 10 పాయింట్లకు 9.88 సాధించింది రష్మిక. ఇక 9.67తో విజయ్ దేవరకొండ రెండో స్థానం, 9.54తో కన్నడ హీరో యశ్ మూడో స్థానం, 9.49తో సమంత నాలుగో స్థానం, 9.46తో అల్లు అర్జున్ ఐదో స్థానంలో నిలిచారు. దుల్కర్ సల్మాన్ - 9.42, పూజా హెగ్డే - 9.41, ప్రభాస్ - 9.40, సూర్య - 9.37, తమన్నా - 9.36, మహేష్ - 9.34, రామ్ చరణ్ - 9.33, ధనుష్ - 9.33, ఎన్టీఆర్ - 9.31 ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.