'మీ టూ'పై పూజా హెగ్డే ఏమంటోంది?
on Oct 24, 2019
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే 'మీ టూ' మూమెంట్ గురించి మాట్లాడింది. కర్ర విరగలేదు, పాము చావలేదు అన్నట్టు... ఎవ్వరినీ నొప్పించకుండా, తానూ ఇబ్బంది పడకుండా మాట్లాడింది. హిందీలో పూజా హెగ్డే ఓ కథానాయికగా నటించిన 'హౌస్ ఫుల్ 4' శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమాకు మొదట సాజిద్ ఖాన్ దర్శకుడు. అతడి లాంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సినిమా నుండి తప్పించారు. అతడి స్థానంలో ఫర్హాద్ సామ్ జి వచ్చాడు. దాంతో ఈ విషయంపై పూజా హెగ్డే స్పందించక తప్పలేదు.
"ప్రొడక్షన్ హౌస్ గొడవలు ఏవీ నటీనటుల దగ్గరకు రానివ్వలేదు. దర్శకుడి మార్పు స్మూత్ గా జరిగింది" అన్నారామె. 'మీ టూ' మూమెంట్ గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ "మూమెంట్ మొదలవడం గొప్ప విషయం. నటిగా, మహిళగా ఈ మూమెంట్ ని లైట్ తీసుకోకూడదని అనుకుంటున్నా. మీ టూ మూమెంట్ ఇండస్ట్రీలో మార్పు తీసుకొచ్చింది. ఇండస్ట్రీకి ఈ మూమెంట్ అవసరం కూడా. తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి మహిళలు బయటకొచ్చి చెప్పడం అంత సులభం కాదు. బయటకొచ్చి చెప్పిన వాళ్లందరికీ మరింత ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు.