ఎన్టీఆర్ ఇచ్చిన ధైర్యంతో అభిమాని కోలుకున్నాడు!
on Oct 26, 2021
ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమానితో ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో సాటి అభిమానిని ఆసుపత్రికి వెళ్లి కలిసిన ఎన్టీఆర్ అభిమానులు అతనికి ఆర్ధిక సాయం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన మురళి ఎన్టీఆర్ వీరాభిమాని. అయితే మురళి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మురళి కోరిక మేరకు.. ఎన్టీఆర్ అభిమాన సంఘం ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడించింది. త్వరలోనే కోలుకుంటావంటూ ఎన్టీఆర్ అతడిలో ధైర్యం నింపారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తావని, త్వరలో మనం కలుద్దామని చెప్పారు. ఎన్టీఆర్ చెప్పినట్లుగానే ఆయన అభిమాని మురళి కోలుకున్నాడు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు ఆసుపత్రికి వెళ్లి అతన్ని కలిసి యోగక్షేమాలు అడగటమే కాకుండా.. రూ.2.5 లక్షలు ఆర్ధిక సాయం చేశారు.
ఆపదలో ఉన్న సాటి అభిమాని కోసం ఎన్టీఆర్ అభిమానులు చొరవ చూపి సాయం చేయడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Also Read