'డీజే టిల్లు'కు త్రివిక్రమ్ సలహాలు.. 100 పర్సెంట్ కొడుతున్నాం!
on Feb 3, 2022

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డీజే టిల్లు'. 'సితార ఎంటర్టైన్ మెంట్స్', 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' కలసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లోని ఏఎంబీ మాల్లో ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉన్న 'డీజే టిల్లు' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అందమైన అమ్మాయి రాధికను సొంతం చేసుకునేందుకు డీజే టిల్లు ప్రయత్నాలు చేస్తుంటాడు. అల్లు అర్జున్ కొత్త సినిమాకు మ్యూజిక్ చేయబోతున్నానంటూ అతను చెప్పుకునే గొప్పలు, చేసే అల్లరి పనులు ఆకట్టుకున్నాయి. నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక, తెలిసే నన్ను హౌలాగాడిని చేస్తున్నావ్ సో స్వీట్ ఆఫ్ యూ రాధికా వంటి డైలాగ్స్ పేలాయి. రాధిక తనొక్కరికే సొంతం కాదని తెలిసినప్పుడు డీజే టిల్లు అసహనం నవ్విస్తుంది. రాధిక టిల్లుకే దక్కిందా?, ఇంకెవరి ప్రేమనైనా అంగీకరించిందా? అనే అంశాలు సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి.

ట్రైలర్ విడుదల సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ.. "ఈ ఏడాది మా సంస్థ నుంచి మూడు చిన్న సినిమాలు వస్తాయి. మధ్యలో పెద్ద సినిమా 'భీమ్లా నాయక్' కూడా ఉంది. 'డీజే టిల్లు' యూత్ సినిమా. 'భీమ్లా నాయక్' మాసివ్ సినిమా. నాకు బాగా నచ్చిన కథ డీజే టిల్లు. కథ నచ్చడంతో కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. దీని మీద మాకు చాలా నమ్మకం ఉంది. గ్యారెంటీ గా విజయం సాధిస్తుంది" అన్నారు.
సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ "ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. థియేటర్ లో మీరు బాగా నవ్వుకుంటారు. నేను జీవితంలో చూసిన సందర్భాలు, మనుషులు, నా స్వభావాలు కొన్ని కలిపి ఈ క్యారెక్టర్ రాసుకున్నాము. త్రివిక్రమ్ గారు స్క్రిపు విషయంలో మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఈ సినిమా రాసేటప్పుడు మాకు అండగా నిలబడిన త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పాలి. నిర్మాత వంశీ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. అప్పుడప్పుడూ మేం ఇంత ఖర్చు పెట్టొద్దని అన్నాం. కానీ, ఆయన ఎక్కడా తగ్గొద్దని చెప్పారు. నేను సితారలో మరో రెండు సినిమాలు చేస్తున్నాను. నాకు సితార హోమ్ బ్యానర్ లాంటిది. ఇది చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం. 100 పర్సెంట్ కొడుతున్నాం. థియేటర్లకు వెళ్లిన అందరూ కళ్లల్లో నీళ్లు వచ్చేలా నవ్వుతారు." అని అన్నారు.
దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ "ఫస్ట్ లాక్డౌన్లో నేను, సిద్ధు కథ మీద కూర్చున్నప్పుడు.. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు జనాల్ని నవ్వించాలనే మోటివ్ తో ఉన్నాం. టీజర్ చూశారు. ఇప్పుడు ట్రైలర్ చూశారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ. ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. నన్నూ సిద్దూని నమ్మారు నిర్మాత వంశీ అన్న." అన్నారు.
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ.. "డీజే టిల్లు ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత పెద్ద చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాత వంశీ గారికి థాంక్స్. రాధిక క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మిన దర్శకుడు విమల్ కి కూడా థాంక్స్. సిద్ధు మల్టీటాలెంటెడ్. డీజే టిల్లు ఫన్, మాస్ ఎంటర్ టైనింగ్ సినిమా. నేను కథ విన్నప్పుడు ఎంతగా ఎంజాయ్ చేశానో సినిమా చూస్తున్నప్పుడు మీరూ అంతే ఆస్వాదిస్తారు" అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



