సంక్రాంతికి ఇదే నెంబర్ వన్ సినిమా అవుతుంది!
on Jan 10, 2022

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'బంగార్రాజు'. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలకానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. "జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోకు అది చాలా ముఖ్యమైన తేది. అదే రోజును అన్నపూర్ణ పుట్టింది. దసరా బుల్లోడు అనే సినిమాతో యాభై ఏళ్ల క్రితం నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారు. అది కూడా మ్యూజికల్ హిట్. సినిమాకు సగం సక్సెస్ మ్యూజిక్. ఆ సగం సక్సెస్ను అనూప్కు ఇస్తున్నాం. చక్కటి మాస్ కమర్షియల్ సాంగ్ ఇచ్చారు. ప్రతీ సాంగ్ ఓ వజ్రంలా ఉంటుంది. సూపర్ హిట్ ఆల్బమ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది. జనవరి 11న ట్రైలర్ రాబోతోంది. జనవరి 14న పండుగ రోజున పండుగలాంటి సినిమాను తీసుకొస్తున్నాం. అందరూ ఆదరించండి’ అని అన్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ.. "బంగార్రాజు ఆడియోను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇప్పుడు ఒక్క పాట హిట్ అయితే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అలాంటిది ఈ సినిమా కోసం అనూప్ అద్బుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ఇది పండుగ లాంటి సినిమా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. బంగారం లాంటి పాత్ర ఇచ్చినందుకు నాన్నకు, కళ్యాణ్ కృష్ణకు థ్యాంక్స్. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది" అని అన్నారు.
డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. "సినిమా సక్సెస్ను మ్యూజిక్ డిసైడ్ చేస్తుంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాగార్జున గారి ప్రతీ సినిమా మ్యూజికల్గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. నేను, నాగ చైతన్య కలిసి చేసిన రారండోయ్ వేడుకచూద్దాం కూడా మ్యూజికల్ హిట్ అయింది. నాగార్జున గారు మాకు ఎన్నో సలహాలు ఇస్తుంటారు. వంద మంది వంద రోజులు నాన్ స్టాప్గా కష్టపడితే ఈ రోజు ఇలా మీ ముందుకు వచ్చాం. ఇండస్ట్రీలో బంగార్రాజు అంటే నాగార్జున గారే. ఇప్పుడు నాగ చైతన్య వచ్చారు. ఇద్దరూ పోటీ పడి నటించారు. ఏ పాత్ర బాగుంది.. ఏ పాత్ర బాగాలేదు.. ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది ఎవ్వరూ చెప్పలేరు" అని అన్నారు.
కృతి శెట్టి మాట్లాడుతూ.. "బంగారమే అనే పాటకు మొదటి సారి డ్యాన్స్ చేశాను. భాస్కర భట్ల గారు ఎంతో మంచి లిరిక్స్ రాశారు. మధు ప్రియ గారు ఎంతో ఎనర్జీతో పాడారు. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు అనూప్ గారికి థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేసిన నాగ చైతన్యకు థ్యాంక్స్. నాగార్జున, రమ్యకృష్ణ గార్లతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను" అని అన్నారు.

సుమంత్ మాట్లాడుతూ.. "అనూప్ రూబెన్స్ అద్బుతమైన సంగీతాన్ని అందించారు. మనం, సోగ్గాడే కంటే ఈ సినిమాలోని ఆల్బమ్ అద్బుతంగా ఉంది. సంక్రాంతికి ఇదే నెంబర్ వన్ సినిమా అవుతుంది. ఎంతో నమ్మకంగా చెబుతున్నాను. సోగ్గాడే కంటే పెద్ద హిట్ అవుతుంది. సంక్రాంతికి సినిమాను తీసుకువచ్చేందుకు అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మాస్కులు వేసుకుని మాస్ థియేటర్లోనే ఈ సినిమాను చూస్తాను" అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



