మెగాస్టార్ `న్యాయం కావాలి`కి 40 ఏళ్ళు
on May 15, 2021
నటుడిగా ఉన్నత దిశగా పయనిస్తున్న తరుణంలో.. నవలా చిత్రాల్లోనూ తనదైన ముద్రవేశారు మెగాస్టార్ చిరంజీవి. అలా.. చిరు నవలా చిత్రాలకు బీజం వేసిన సినిమాగా `న్యాయం కావాలి`కి ప్రత్యేక స్థానముంది. డి. కామేశ్వరి నవల `కొత్త మలుపు` ఆధారంగా తెరకెక్కిన ఈ సందేశాత్మక చిత్రంలో మెగాస్టార్.. ప్లే బోయ్ తరహా పాత్రలో నెగెటివ్ షేడ్స్ తో కనిపించారు. అతనికి జోడీగా రాధిక, ఫటాఫట్ జయలక్ష్మి నటించిన ఈ సినిమాలో `ఊర్వశి` శారద ముఖ్య భూమికని పోషించగా.. జగ్గయ్య, అల్లు రామలింగయ్య, అత్తిలి లక్ష్మి, బేబి తులసి, బేబి రోహిణి కీలక పాత్రల్లో అలరించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు అతిథి పాత్రలో మెరిశారు.
ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రాంతి కుమార్ నిర్మించారు. దిగ్గజ స్వరకర్త చక్రవర్తి సంగీతసారథ్యంలో రూపొందిన పాటల్లో ``ఈరోజే ఆదివారం.. లవ్ లవ్ యు భారతి`` అంటూ సాగే గీతం విశేషాదరణ పొందింది. హిందీలో `ముఝే ఇన్సాఫ్ చాహియే`, కన్నడలో `కేరలిద హెన్ను`, తమిళంలో `విధి`, మలయాళంలో `తాళమ్ తేట్టియ తారట్టు` టైటిల్స్ తో `న్యాయం కావాలి` రీమేక్ అయింది.
అటు తన లక్కీ హీరోయిన్స్ లో ఒకరైన రాధికతో జోడీకట్టిన తొలి చిత్రంగానూ.. ఇటు తనతో అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో మొదటి సినిమాగానూ చిరుకి `న్యాయం కావాలి` వెరీ వెరీ స్పెషల్ మూవీ అనే చెప్పాలి. 1981 మే 15న విడుదలై ఘనవిజయం సాధించిన `న్యాయం కావాలి`.. నేటితో 40 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read