మహేశ్ జోడీగా 'మహానటి'?
on Mar 26, 2020
లాక్డౌన్ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ ఇంట్లో ఫ్యామిలీతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మిగతా టాప్ స్టార్స్ సినిమాల షూటింగ్లు ఆగిపోయి షెడ్యూల్స్ అన్నీ డిస్టర్బ్ అవగా, ఒక్క మహేశ్ మాత్రమే ఆ ఇబ్బంది నుంచి తప్పించుకున్నాడు. 'సరిలేరు నీకెవ్వరు' మూవీ తర్వాత ఆయన సెలవులను ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే కరోనా ఎఫెక్ట్ ఇండస్ట్రీపై పడింది.
కాగా పరశురామ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మే నెలలో ఈ సినిమాని ప్రారంభించాలని ఇదివరకే అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు షెడ్యూల్లో చిన్న మార్పు జరిగినట్లు సమాచారం. మహేశ్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. జూలై నుంచి షూటింగ్ జరపనున్నారు. మహేశ్తో ఇదివరకు 'శ్రీమంతుడు' వంటి బ్లాక్బస్టర్ మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనున్నది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఇదివరకు రెండు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.. కియారా అద్వానీ, పూజా హెగ్డే. ఇప్పుడు ఆ రెండు పేర్లు కాకుండా మరో పేరు వినిపిస్తోంది. అది.. జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ పేరు! అవును. 'భరత్ అనే నేను' మూవీ నుంచి ఫ్రెష్ కాంబినేషన్తో సినిమాలు చేస్తూ వస్తున్న మహేశ్.. మరోసారి తొలి కాంబినేషన్కే ఓటేశాడనీ, పరశురామ్ సూచించిన కీర్తి సురేశ్ పేరును వెంటనే యాక్సెప్ట్ చేశాడనీ వినిపిస్తోంది.
'మహానటి' సినిమాతో 'కీర్తి' ప్రతిష్ఠలు అమాంతం పెరిగాయి. అప్పట్నుంచి సినిమాల ఎంపికలో ఆమె శ్రద్ధ వహిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే', విమన్ సెంట్రిక్ మూవీ 'మిస్ ఇండియా', తమిళంలో రజనీకాంత్ కూతురుగా 'అన్నాత్తే' సినిమాలు చేస్తోంది. మహేశ్తో ఆమె చేయడం ఖాయమైతే ఆ ఇద్దరి జంట ప్రేక్షకులకు కన్నుల పంటే!