12 ఏళ్ళ తరువాత గీతా ఆర్ట్స్ లో..?
on May 4, 2021
తమిళ్, తెలుగు, హిందీ.. ఇలా మూడు భాషల్లోనూ విజయవంతమైన చిత్రాలను రూపొందించి పాన్ - ఇండియా డైరెక్టర్ అనిపించుకున్నారు కోలీవుడ్ కెప్టెన్ ఎ.ఆర్. మురుగదాస్. సూపర్ స్టార్ రజినీకాంత్ తో తెరకెక్కించిన `దర్బార్` (2020) తరువాత మరో సినిమాని పట్టాలెక్కించని మురుగదాస్.. త్వరలో ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నారట. అంతేకాదు.. దీన్ని ఓ తెలుగు స్టార్ తో రూపొందించనున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. హిందీ చిత్రం `గజిని`(2008)తో భారతీయ చిత్ర పరిశ్రమకు తొలి రూ. 100 కోట్ల వసూళ్ళ మార్క్ ని పరిచయం చేసిన కాంబినేషన్ మురుగదాస్ - గీతా ఆర్ట్స్ సంస్థది. ఆ చిత్రం విడుదలై 12 సంవత్సరాలవుతున్నా.. ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. కాగా, త్వరలోనే ఆ ముచ్చట తీరనుందని బజ్. అంతేకాదు.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో `గీతా ఆర్ట్స్` సంస్థ అధినేత అల్లు అరవింద్ తనయుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే బన్ని- గీతా ఆర్ట్స్ - ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
ఇదిలా ఉంటే.. బన్ని ప్రస్తుతం `పుష్ప` చేస్తున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా తయారవుతోంది.