మహేశ్ కి జోడీగా జాన్వీ కపూర్?
on May 5, 2021
80ల్లో సూపర్ స్టార్ కృష్ణ - అతిలోక సుందరి శ్రీదేవిది సూపర్ హిట్ జోడీ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. కట్ చేస్తే.. త్వరలో వీరిద్దరి నటవారసులు
తొలిసారి జట్టుకట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. కృష్ణ తనయుడు మహేశ్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా
రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇద్దరు నాయికలకు స్థానముందట. వారిలో ఒకరిగా శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. అదే గనుక నిజమైతే.. అనతికాలంలోనే హిందీనాట క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న జాన్వికి తెలుగులో ఇదే తొలి ప్రయత్నమవుతుంది. త్వరలోనే మహేశ్, జాన్వి జోడీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా.. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్న ఈ చిత్రం.. 2022 వేసవిలో థియేటర్స్ లో సందడి చేయనుంది.