కూటమిపై ప్రజా వ్యతిరేకత... అధ:పాతాళంలోకి వైసీపీ గ్రాఫ్.!.. పయనీర్ స్ట్రాటజీస్ సర్వే వెల్లడి.!
Publish Date:Jul 30, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. స్థనిక ఎన్నికలు వినా ఇప్పట్లో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం లేదు. అయితే రెండేళ్ల తెలుగుదేశం కూటమి పాలన పట్ల ప్రజా స్పందన ఎలా ఉంది? ప్రతిపక్ష హోదా లేకున్నా రాష్ట్రంలో ఏకైక విపక్షం గా ఉన్న వైసీపీ పట్ల ప్రజాదరణ ఎలా ఉంది అన్న అంశాలపై ప్రముఖ పొలిటికల్ రీసెర్చ్ సంస్థ పయనీర్ స్ట్రాటజీస్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితం ఇటు అధికార కూటమిలోనూ, అటు వైసీపీలోనూ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. రెండేళ్ల పాలనలో తెలుగుదేం కూటమి సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ సునాయాసంగా గతం కంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ఫలితం కుండబద్దలు కొట్టింది. అయితే తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే. ఇక వైసీపీ విషయానికి వస్తే.. 40 శాతం ఓటు షేర్, ప్రభుత్వ వ్యతిరేకతే తమను 2029 ఎన్నికలలో అధికారంలో కూర్చోబెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీకి ఈ సర్వే ఫలితం ఊహించని షాక్ ఇచ్చింది. తిరిగి అధికారంలోకి రావడం అటుంచి.. ఆ పార్టీ గ్రాఫ్ ఈ రెండేళ్లలో అధ:పాతాళానికి పడిపోయిందని సర్వే తేల్చింది. గత ఎన్నికల ఘోర పరాజయం నుండి కోలుకుని తిరిగి పుంజుకుంటామని ఆశిస్తున్న వైపీపీకి పయనీర్ స్ట్రాటజీన్ సర్వే గట్టి షాక్ ఇచ్చింది. సర్వే ప్రకారం.. ఈ రెండేళ్లలో క్షేత్రస్థాయిలో వైసీపీ ఓటు బ్యాంకు పుంజుకోవడం అటుంచి ఉన్న ఓటు బ్యాంకు కూడా చాలా వరకూ దూరమైంది. పయోనీర్ స్ట్రాటజీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వేలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలలో ఒకింత వ్యతిరేకత కనిపిస్తున్నా.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలతే వ్యక్త మౌతోంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పరిశ్రమల రాక, పెట్టుబడుల ప్రవాహం, అమరావతి, పోలవరం పనులలో వేగం వంటివి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తోసి రాజని సానుకూలతను తీసుకువచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం కూటమి గెలుచుకునే సీట్ల సంఖ్య గతం కంటే ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ, పట్టణ, నగరాలు అన్న తేడా లేకుండా.. యువత, మహిళలు రైతులు తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికే జై కొడుతున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే.. గతంలో అధికారాన్ని అనుభవించి, 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యేంతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ పట్ల ఈ రెండేళ్లలో ప్రజలలో ఇసుమంతైనా సానుకూలత కానరావడం లేదని పయనీర్ స్ట్రాటజీస్ సర్వే తేల్చింది. అధికారం కోల్పోయిన తరువాత ఈ రెండేళ్లలో పార్టీ ఇసుమంతైనా పుంజుకోలేదని సర్వే ఫలితం పేర్కొంది. పుంజుకోకపోవడం అటుంచితే.. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే వైసీపీ గత ఎన్నికలలో సాధించిన 11 స్థానాలను నిలుపుకోవడం కూడా కష్టమేనని సర్వే పేర్కొంటున్నది. అధికారంలో ఉన్న సమయంలో చేసిన పొరపాట్లు, ప్రజావ్యతిరేక నిర్ణయాలు, నిధుల మళ్లింపు వంటి అంశాలు ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో బలంగా ఉన్నాయని సర్వే పేర్కొంది. వైసీపీ ఓటు షేర్ మరింత దిగజారిపోవడానికి ఆ పార్టీ వైఖరి, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం, ప్రజా సమస్యలపై స్పందించకపోవడంతో పాటు.. ఆ పార్టీ అధినేత బెంగళూరు మకాం కూడా కారణం అని సర్వే పేర్కొంది. ఇక ఈ సర్వే ఓటు శాతం విషయంలో కూడా తెలుగుదేశం కూటమి, వైసీపీల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని వెల్లడించింది. గత ఎన్నికలలో 40 శాతం ఓటు షేరు మాకుందని చెప్పుకున్న వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 28 శాతం ఓటు షేర్ కు పరిమితమౌతుందని సర్వే తేల్చింది. అదే సమయంలో తెలుగుదేశం కూటమికి 49 శాతం ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. కూటమి పాలనపై ఒకింత అసంతృప్తి వ్యక్తమౌతున్నప్పటికీ, వైసీపీపై పెరుగుతున్నవ్యతిరేకత కారణంగా అది లెక్కలోకి రావడం లేదని సర్వే తేల్చింది. YCP graph fallen, AP Political Survey, Pioneer Strategy Survey, TDP Alliance Lead, YSRCP Vote Share Drop, AP Politics, TeluguOne
ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, మరియు రాయలసీమ ఇలా మూడు ప్రాంతాలలోనూ పయనీర్ స్ట్రాటజీన్ సర్వే చేసింది. ఈ సర్వేలో బయటపడిన మరో విశేషం ఏమిటంటే.. వైసీపీకి పెట్టని కోట వంటి రాయలసీమ ప్రాంతంలో కూడా ఆ పార్టీ ప్రతిష్ట మసకబారింది. సీమ ప్రాంతంలో కూడా తెలుగుదేశం కూటమి వైపు మొగ్గు స్పష్టంగా గోచరిస్తోంది. యువత, నిరుద్యోగులలో ఐటీ ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక వేత్తల పెట్టుబడుల పట్ల ఆశావహ దృక్పథం వ్యక్తమవుతుండగా, మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం, ఇతర సంక్షేమ హామీల అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు వైసీపీకి కొండంత అండగా నిలిచిన గ్రామీణ ఓటర్లు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి నమూనా వైపే మొగ్గు చూపుతున్నారని సర్వే ఫలితం పేర్కొంది.
http://www.teluguone.com/news/content/ycp-graph-fallen-39-227565.html





