శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపివేత...!
Publish Date:Aug 11, 2026
Advertisement
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో బుధవారం నాడు ఉచిత సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం రోజున శ్రీవారి దర్శనం పొందాలనుకునే భక్తులకు బుధవారం ఎలాంటి టోకెన్లు జారీ చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, గురువారం దర్శనం కోసం వేచి ఉండే భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనంలో స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. టోకెన్ రహిత సర్వదర్శన విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. టోకెన్ల జారీ ప్రక్రియలో మార్పులపై టీటీడీ పూర్తి స్పష్టత ఇచ్చింది. బుధవారం పంపిణీ ఆపేసినప్పటికీ, శుక్రవారం నాటి దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లను యథావిధిగా గురువారం మధ్యాహ్నం నుంచి తిరుపతి కేంద్రాల్లో జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. మరోవైపు, మంగళవారం రోజున శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని కేంద్రాల్లో దాదాపు 10 వేల ఎస్ఎస్డీ టోకెన్లను అధికారులు విడుదల చేశారు. వీటిని పొందిన భక్తులకు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా 2,000 టోకెన్లను అందజేశారు. వాస్తవానికి ఈ టోకెన్ రహిత సర్వదర్శన విధానాన్ని టీటీడీ ఒకేసారి కాకుండా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. వరుసగా ఏడో బుధవారం కూడా టోకెన్లు ఇవ్వకుండా, తిరుమలకు వచ్చిన భక్తులకు వచ్చినట్లే నేరుగా సర్వదర్శనం కల్పించే ప్రయత్నం చేస్తోంది. భక్తుల రద్దీ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకే ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం చెబుతోంది. అయితే, ముందస్తు ప్రణాళికతో తిరుపతికి వచ్చే సాధారణ భక్తులు ఈ నిర్ణయం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు లభిస్తే కచ్చితమైన సమయానికి దర్శనం పూర్తవుతుందని, ఉన్నపళంగా నిలిపివేస్తే తిరుమలలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని పలువురు భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రయోగం ఫలితాలను బట్టి రాబోయే రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లోనూ టోకెన్ రహిత సర్వదర్శన విధానాన్ని విస్తరించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. భక్తుల అభిప్రాయాలు, తిరుమలలో రద్దీ పరిస్థితులను బేరీజు వేసుకుని శాశ్వత మార్గదర్శకాలపై త్వరలోనే దేవస్థానం నిర్ణయం తీసుకోనుంది. Tirumala SSD Tokens, Tirumala Srivari Darshan, Tirupati Srinivasam Vishnu Nivasam, TTD Devotee Darshan Rules, TTD
http://www.teluguone.com/news/content/tirumala-ssd-tokens-36-228692.html





