టీవీ చూస్తే బాసూ... మెమరీ లాసు...
Publish Date:May 9, 2024
Advertisement
ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా? అయితే మిమ్మల్ని త్వరలోనే మతిమరుపు పలకరిస్తుంది అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. రోజుకి గంటకన్నా తక్కువ సమయం మాత్రమే టీవీ చూస్తున్న వారికి మధ్య జ్ఞాపకశక్తి విషయంలో చాలా తేడా వుందని వీరి పరిశోధనలో తేలింది. కొన్ని వేలమందిపై రకరకాల పరీక్షలు నిర్వహించి తేల్చిన విషయమిది. చిన్న చిన్న విషయాలని కూడా టీవీని అతిగా చూసేవారు మర్చిపోతుండటం గమనించారట వీరు. ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిపై టీవీ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు వీరు. స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి కూర్చునే ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. మరి జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు అని వీరిని అడిగితే అందుకు చాలా మార్గాలున్నాయ్. అయితే టీవీ చూడటం తగ్గించమంటున్నాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరో మార్గం ఉంది. దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా స్వంతమవుతుంది జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అంటున్నారు. ‘కాల్పనిక సాహిత్యం’ చదివితే మెదడు పదునెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. నమ్మకం లేకపోతే ఓ 20 రోజులపాటు మేం చెప్పింది పాటించి చూడండి అని చెబుతున్నారు ఈ ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి టీవీ చూడటం తగ్గించి చదవటం మొదలుపెడదామా!? -రమ
http://www.teluguone.com/news/content/television-causing-short-term-memory-loss-35-38593.html





