మహిళల టీ20 వరల్డ్ కప్.. పాకిస్థాన్ పై టీమ్ ఇండియా ఘన విజయం
Publish Date:Jun 14, 2026
Advertisement
మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల స్కోరు సాధించింది. భారత ఇన్నింగ్స్లో ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో మెరిసింది. కేవలం 44 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 35 బంతుల్లో 36 పరుగులు, ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ సిక్సర్లు 17 బంతుల్లోనే మూడు ఫోర్లు ఒక సిక్సర్ తో వేగంగా 34 పరుగులు జోడించడంతో భారత్ పాక్కు 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఆ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు భారత బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. పవర్ప్లే ముగిసేసరికి పాక్ వికెట్ నష్టానికి 52 పరుగులు పటిష్టంగానే కనిపించినప్పటికీ.. ఆ తరువాత దీప్తిశర్మ, శ్రీచరిణిలు పాక్ జట్టును తమ స్పిన్ మాయాజాలంలో కుప్పుకూల్చారు. ముఖ్యంగా దీప్తి శర్మ తన స్పిన్ మాయాజాలంతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ నడుం విరిచింది. పాక్ ఓపెనర్ మునీబా అలీ ఒంటరి పోరాటం చేస్తూ 41 పరుగులు చేసినప్పటికీ, ఆమె రనౌట్ గా వెనుదిరగడంతో పాక్ జట్టు చేతులెత్తేసింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 17 ఓవర్లలో కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి శర్మ 5 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించింది. శ్రీ చరణి మూడు వికెట్లు, షెఫాలి వర్మ ఒక వికెట్ పడగొట్టారు. అద్భుత బౌలింగ్ తో భారత్కు విజయాన్ని అందించిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
http://www.teluguone.com/news/content/team-india-resounding-victory-over-pakistan-36-222930.html





