తిరుమల లడ్డూ ప్రసాదం విక్రయాలు పెరిగాయి.. ఎందుకంటే?
Publish Date:Sep 23, 2024
Advertisement
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై తార స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ కూడా లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గలేదు సరికదా గణనీయంగా పెరిగాయి. ఈ వివాదం వెలుగులోకి రాకముందు.. అంటే జగన్ హయాంతో పోలిస్తే.. గత పది రోజులుగా లడ్డూ విక్రయాలు విపరీతంగా పెరిగాయి. జగన్ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత గణనీయంగా తగ్గిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. నాణ్యత లేనందున భక్తులు లడ్డూ ప్రసాదాల కొనుగోలు విషయంలో కొంచం ముందు వెనుకలాడారు. గతంలోలా శ్రీవారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయకుండా నియంత్రణ పాటించారు. పెద్ద సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తమ తమ ఊర్లకు తీసుకు వెళ్లి బంధు మిత్రులకు పంచే సంప్రదాయానికి జగన్ హయాంలో చెక్ పడింది. ఎందుకంటే అప్పట్లో లడ్డూ నిలవ ఉండేది కాదు. నాణ్యతా లోపం కారణంగా రెండు మూడు రోజులకే పాడైపోయేది. తిరుమల యాత్ర ముగించుకని తమ తమ ఊళ్లకు వెళ్లిన తరువాత లడ్డూ ప్రసాదాన్ని బంధు మిత్రులకు పంచాలంటే భక్తులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఆ కారణంగానే జగన్ అధికారంలో ఉండగా లడ్డూ ప్రసాదాల విక్రయాలు పడిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెరిగిన విషయాన్ని భక్తులు గుర్తించారు. సామాజిక మాధ్యమం ద్వారా పలువురు ఈ విషయాన్ని చాటారు. దీంతో కూటమి సర్కార్ కొలువుదీరిన తరువాత తిరుమల లడ్డూ ప్రసాదాల విక్రయాలలో పెరుగుదల కనిపించింది. అయితే అప్పటికి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ అయ్యిందన్న విషయం వెలుగులోనికి రాలేదు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే తిరుమల ప్రక్షాళన ప్రారంభించింది. అన్న ప్రసాదం నుంచి, తిరుమల కొండపై హోటళ్లలో పారిశుద్ధ్యం, తినుబండారాలలో నాణ్యత విషయంలో రాజీపడకుండా ముందుకు సాగడంతో మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది. జనం, భక్తులు కూడా అదే అనుకున్నారు. అయితే ఎప్పుడైతే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు అవశేషాల వినియోగం వెలుగుచూసిందో... భక్తులు నివ్వెర పోయారు. దిగ్భ్రాంతికి గురయ్యారు. జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యతా లోపానికి కారణం తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యత విషయంలో రాజీ పడబోమన్న చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకుని కల్తీని నివారించారని భక్త జనం నమ్ముతున్నారు. అందుకే ఇంతటి వివాదంలోనూ గతం కంటే లడ్డూ విక్రయాలలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ నెల 19న భక్తులు 3 లక్షల 59 వేల 650 లడ్డూలు కొనుగోలు చేస్తే.. 20వ తేదీన ఆ సంఖ్య 3లక్షల 17 వేల 954గా ఉంది. ఇక 21వ తేదీనైతే అది 3 లక్షల 67 వేల 607కు పెరిగింది. దీనిని బట్టి చూస్తే లడ్డూ ప్రసాదం వివాదం వాటి విక్రయాలపై ఇసుమంతైనా ప్రభావం పడలేదని స్పష్టమౌతోంది. ఇందుకు కూటమి కొలువుదీరిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం పారదర్శకంగా వ్యవహరించడం, నాణ్యత పెంపు స్ఫష్టంగా కనిపిస్తుండటం కారణంగా చెప్పవచ్చు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో మళ్లీ నంది నెయ్యే వినియోగిస్తున్నట్లే టీటీడీ ప్రకటించడం కారణంగా చెప్పొచ్చు.
http://www.teluguone.com/news/content/spurge-in-tirumala-laddu-prasadam-sales-39-185386.html