బర్తడే పార్టీని రద్దు చేయించి మరీ.. కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన నిజాలు
Publish Date:Jun 25, 2026
Advertisement
పుణేకి చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. మొదట లోహగడ్ కోట సమీపంలో లోయలో పడి జరిగిన ప్రమాదంగా భావించిన ఈ ఘటన.. పోలీసుల దర్యాప్తులో అత్యంత దారుణ హత్యగా తేలింది. కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారమే కేతన్ ప్రాణాలు తీసిందని దర్యాప్తు తేల్చింది. ఒక క్రైమ్ సినిమాను తలపించేలా సాగిన ఈ ఘోర హత్యోదంతంలో రోజుకో సంచలన వాస్తవం వెలుగులోకి వస్తున్నది. వివరాల్లోకి వెడితే.. కేతన్ అగర్వాల్కు, సియా గోయల్కు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం జరిగింది. నవంబర్ లో వీరిద్దరికీ వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే.. సియా గోయల్కు అంతకుముందే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. బేకరీ నడుపుకునే సియాకు, డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసే చేతన్ చౌదరితో ప్రేమ బంధం ఉంది. ఈ క్రమంలోనే కేతన్తో పెళ్లి నిశ్చయించడంతో, తమ ప్రేమ బంధానికి అతడు అడ్డుగా మారుతాడని సియా భావించి కేతన్ను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు చేతన్తో కలిసి పథకం రచించింది. కాగా నిందితురాలు సియా గోయల్ పుట్టినరోజు జూన్ 20న వైభవంగా నిర్వహించడానికి కేతన్ కుటుంబం భారీ ఏర్పాట్లు చేసింది. కాబోయే కోడలిపై ఉన్న ప్రేమతో కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన మహాబలేశ్వర్లోని ఒక లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్లో ఏకంగా 70 గదులను ముందుగా బుక్ చేశారు. ఇరు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా బర్త్డే వేడుకలు జరపాలని నిర్ణయించారు. అయితే ఈ వేడుకల వల్ల తమ ప్లాన్కు ఆటంకం కలుగుతుందని భావించిన సియా గోయల్, చాలా తెలివిగా మహాబలేశ్వర్ పర్యటనను రద్దు చేసుకునేలా కేతన్ను ఒప్పించింది. దానికి బదులుగా జూన్ 18న పుణే పరిసరాల్లోని లోహగడ్ కోట సందర్శనకు ప్లాన్ చేసింది. అక్కడ కేతన్ ను హత్య చేయడానికి ప్రియుడితో కలిసి ప్రణాళిక రచించి అమలు చేసింది. వాస్తవానికి.. కేతన్ను ఖతం చేయడానికి అంతకుముందు నాలుగు సార్లు వీరు విఫలయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. జూన్ 18వ తేదీన లోహగడ్ కోట వద్ద చేసిన ఐదో ప్రయత్నం పలిచింది. ఒకవేళ ఆ రోజు ప్లాన్ ఫెయిల్ అయితే అమలు చేయడానికి 'ప్లాన్ సి' ని కూడా సిద్ధంగా ఉంచుకున్నట్లు పోలీసు విచారణలో వీరు అంగీకరించారు. జూన్ 18న కోటపై ట్రెకింగ్ చేస్తూ.. కాబోయే భార్యను ఫోటోలు తీస్తున్న సమయంలో ఈదురు గాలుల వల్ల కాలుజారి లోయలో పడిపోయాడంటూ సియా గోయల్ మొదట కట్టుకథలు అల్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే ఈ కేసులో పోలీసులకు లభించిన లూప్హోల్స్ నేరస్థులను బుక్ చేశాయి. ప్రమాదం జరిగిన రోజున లోహగడ్ కోట పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు ఆ రోజు తీవ్రమైన ఎండ, సుమారు 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంతటి మండుటెండలో కూడా ఒక వ్యక్తి ఒంటి నిండా హుడీ ధరించి, తలపై క్యాప్ పెట్టుకుని, ముఖం కనిపించకుండా హెడ్సెట్ తగిలించుకుని తిరగడం పోలీసులకు అనుమానం కలిపించింది. ఆ ఫుటేజీలో కేతన్, సియా నడుస్తుండగా.. వారికి కేవలం 20 నుండి 30 అడుగుల దూరంలోనే ఈ హుడీ ధరించిన వ్యక్తి వారిని అనుసరిస్తూ కనిపించాడు. అలాగే.. సియా గోయల్ నడుస్తూ అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూడటం, ఆమె చూడగానే ఆ హుడీ వ్యక్తి అక్కడే కింద కూర్చోవడం రికార్డైంది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ జరపగా.. ఆ హుడీ ధరించిన సియా ప్రియుడు చేతన్ చౌధరి అని తేలింది. కోటపై జనసంచారం తక్కువగా ఉన్న సమయం చూసి, ఇద్దరూ కలిసి కేతన్ను బలవంతంగా లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వారు అంగీకరించారు.
http://www.teluguone.com/news/content/shocking-details-emerge-in--pune-businessman-murder-case-36-224105.html





