ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి
Publish Date:Apr 16, 2025
.webp)
Advertisement
అజ్ఞాతంలో ఏపీ లిక్కర్ స్కామ్ కింగ్ పిన్
సినీ ఇండస్ట్రీపై మోజుతో ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అవతారమెత్తిన రాజ్ కసిరెడ్డి దందాలు వరుసగా బయటపడుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి దోచుకున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పి, కార్తికేయ-2 ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్ 29న ఈ సినిమాను విడుదల చేశారు. దీనికి కథ కూడా రాజ్ కసిరెడ్డే సమకూర్చినట్లు టైటిల్స్లో వేసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనకున్న రహస్యాన్ని స్పృశిస్తూ, ఓ గూఢచారి ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు ఉప్పలపాటి చరణ్తేజ్ అనే ఓ డైరెక్టర్, రచయితను సీఈవోగా పెట్టుకున్నారు. ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకూ అడ్వాన్సులిచ్చారు. ఆ మధ్య కాలంలో మిడ్ రేంజ్, కొత్త హీరోలతో హిట్ సినిమాలు తీసిన నలుగురైదుగురు డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు. మద్యం కుంభకోణంలో సమకూరిన నగదును దీనిలో కుమ్మరించినట్లు సమాచారం. ఈ లోగా ఎన్నికలు ముంచుకొచ్చేయడం, ఏపీలో జగన్ అధికారం కోల్పోవడం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు తీవ్రతరం కావడంతో.. ఆ కొత్త ప్రాజెక్టులన్నింటినీ నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రాజ్ కసిరెడ్డి.
స్పై సినిమాను ఎంత బడ్జెట్లో నిర్మించినట్లు చెప్పారు? దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత? ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది? ఏయే రూపాల్లో చెల్లించారు? ఈ సినిమాకు జరిగిన వ్యాపారమెంత? తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్ సేకరించింది. ఇంకా ఏయే సినిమాలు నిర్మాణానికి పైప్లైన్లో పెట్టారు? వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు చూపించారు? ఇందుకు మనీ రూటింగ్ ఎలా చేశారు? అనే దానిపై సిట్ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. 2020 డిసెంబరు 12న ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థను నెలకొల్పిన రాజ్ కసిరెడ్డి.. ఆ వెంటనే స్పై చిత్రం నిర్మాణం చేపట్టారు. దానికి నిర్మాతగా తన పేరు అధికారికంగానే వేసుకున్నారు.
మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిట్ బృందాలు ఇటీవల ఈడీ ఎంటర్టైన్మెంట్స్ రిజిస్టర్ చిరునామా అయిన హైదరాబాద్ మణికొండ ప్రశాంతి హిల్స్లోని ప్లాట్లలో తనిఖీలు జరిపాయి. అక్కడ ప్రస్తుతం ఈడీ ఎంటర్టైన్మెంట్స్కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు కొనసాగట్లేదని గుర్తించాయి. ఇదే చిరునామాలో రీసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీ ఉంది. దీనికి రాజ్ కసిరెడ్డి సతీమణి సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శినిరెడ్డి ఎండీగా, ఆమె తల్లి పైరెడ్డి సుజాతరెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కంపెనీకి, ఈడీ ఎంటర్టైన్మెంట్స్కు మధ్య లావాదేవీలు ఏమైనా సాగాయా అన్నదానిపై కూడా సిట్ బృందాలు ఆరా తీస్తున్నాయి.
మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి సిట్ ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన పోలీసు విచారణకు హాజరు కాలేదు. సిట్ గత నెల 28, 29 తేదీలలో ఇచ్చిన నోటీసులు ఇవ్వగా విచారణకు గైర్హాజరైన రాజ్ కసిరెడ్డి తనకు సిట్ నోటీసులు పంపడాన్ని సవాల్ చేస్తూ హైకో ర్టును ఆశ్రయించారు.
అయితే కసిరెడ్డి రాజ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ నోటీసుల విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో సిట్ ఆయనకు ఈ నెల 5న మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 9న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది. అయితే కసిరెడ్డి రాజ్ ఈ సారీ విచారణకు డుమ్మా కొట్టారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాప్ ఉంది. దీంతో కసిరెడ్డి పరారీలో ఉన్నట్లు నిర్ధారించుకున్న సిట్ అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
http://www.teluguone.com/news/content/producer-cum-director-kasireddy-raj-39-196312.html












