తెలంగాణలో పీక్స్కు చేరిన పొలిటికల్ హీట్..
Publish Date:Apr 16, 2022
Advertisement
తెలంగాణలో రాజకీయ ఉష్ణోగతలు వడివడిగా పరుగులు తీస్తున్నాయి. మూడు పాదయాత్రలు, ఆరు ఆందోళనలుగా టీ’ రాజకీయం రోడ్డెక్కింది. అధికార తెరాస సహ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ, వీధుల్లో ఓట్ల వేట సాగిస్తునాయి. అధికార తెరాస వరి వివాదాన్నిఅస్త్రం చేసుకుని బీజేపీ టార్గెట్’ గా కేంద్రం పై యుద్ధం ప్రకటించింది. రోడ్డెక్కింది. ఆందోళనను ఢిల్లీ దాకా తీసుకు పోయింది . అయినా కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ముడి బియ్యం కొంటామే తప్ప బాయిల్డ్ రైస్ కిలో కూడా తీసుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. దీంతో చేసేది లేక ఢిల్లీ ధర్నా ముగించుకుని, హైదరబాద్ చేరిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్గంతో ‘మమ’ అనిపించి వేసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ప్రకటించారు. అంటే, కేంద్రం చెప్పిన దానికి జీ హుజూర్ అని తల ఊపిండి. అంతే కాకుండా ఇంతవరకు యాసంగిలో రారైస్’ ఎంతిస్తారో, ఎప్పుడిస్తారో చెప్పమని, కేంద్రం ఎన్ని లేఖలు రాసినా సమాధానం అయినా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వానికి, తత్త్వం ఎలా బోధ పడిందో ఏమో,కానీ, రారైస్’ తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కేంద్రానికి లేఖ రాసింది. అక్కడితో తెరాస సాగించిన కేంద్రం పై వరి యుద్ధంలో మరో అంకం ముగిసింది. ఇప్పుడు ఇంకో అంకం మొదలైంది .. ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చూడవలసి వుంది. అయితే, ఒకటి మాత్రం నిజం, వరి సాగు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం అంటూ ఏదీ లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రైతులను పావులగా వాడుకుంటోందని సామాన్య రైతులకు కూడా తెలిసి పోయింది. అధికార పార్టీ, ఆ విధంగా రాజకీయ ఆరాటం చూపిస్తుంటే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమదైన పంథాలో పాదయాత్రలు, పబ్లిక్ మీటింగ్స్, ఆందోళనలతో జనంలోకి వెళ్లేందుకు పరుగులు తీస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు.జోగులాంబ గద్వాల నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. మైనార్టీలంటే కేసీఆర్కు భయమని, కేసీఆర్ నిజమైన హిందువైతే అలంపూర్ ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కేసులన్నీ తిరగదోడతామని, అక్బరుద్దీన్ను వదిలే ప్రసక్తే లేదని బండిసంజయ్ హెచ్చరించారు. బండి ప్రసంగంలో కొత్తదనమేమీ లేక పోయినా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నట్లుగా హిందుత్వమే ప్రధాన అజెండాగా బండి యాత్ర సాగుతుందనే సంకేతాలు అయితే స్పష్టంయ్యాయి. ఒవైసీల మెడ మీద కట్టి పెట్టి, తెరాస / కీసీఆర్’ను కొట్టేందుకు బండి వ్యూహాత్మకంగా అజెండాను ఫిక్స్ చేసుకున్నారు. అదలా ఉంటే భట్టి విక్రమార్క, పాదయాత్రలో లెఫ్ట్ పార్టీల జెండాలు కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆశక్తి రేకెత్తిస్తోంది. గతంలో తొమ్మిది వామపక్ష పార్టీల మద్దతుతో సాగిన వైఎస్సార్ పాదయాత్రలో కనిపించిన దృశ్యాలు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయని అంటున్నారు. భట్టి మెడలోనూ కాంగ్రెస్ కడువాను అల్లుకున్న సిపిఐ, సిపిఎం పార్టీల కండువాలు కని పిస్తున్నాయి. నిజానికి, ఇంతవరకు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య అధికారిక ఒప్పందం ఏదీ కుదరక పోయినా, భవిష్యత్ అలాంటి ఒప్పదం ఉంటుందనేందుకు, ఇది ఒక సంకేతం అనికోవచ్చని అంటున్నారు. మరోవంక తెలంగాణలో రాజన్న రాజ్యం లక్ష్యంగా, జెండా ఎత్తిన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 56వ రోజుకు చేరుకుంది. షర్మిల పాదయాత్రకు పెద్దగా స్పందన లేకున్నా, ఆమె ‘తగ్గేదేలే’ అంటూ నడక సాగిస్తూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.కేసీఆర్’ దొర అని సంభోదిస్తూ ఆయన పాలన తాలిబాన్లను తలపిస్తోందని, ప్రధాన ప్రతిపక్షాలకంటే ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అయితే, ఎన్నికలలో ఆమె ప్రభావం ఏ మేరకు ఉంటుందని అనేది ఇప్పుడే చెప్పే పరిస్థితి అయితే లేదు. నిజానికి, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయముంది. కానీ, ఎన్నికలు గుమ్మలోకి వచ్చాయనే విధంగా రాజకీయ పార్టీలు, నాయకులు హైరాణ పడిపోతున్నారు, ఆవేశంతో ఊగిపోతున్నారు. సరే, ఇక భాష సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన భాషలో ఆయన మాట్లడుతున్నారు. తెరాస నాయకులు ఆయన్ని ఫాలో అవుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి, వారివారి అనుచర గణాలు, అంతా యథారాజా ... పద్దతిలో చక్కగా బూతులాడుకుంటున్నారు. అయితే, రాజకీయ పరిశీలకులు మాత్రం అన్ని డ్రామాలు చూస్తున్న ప్రజలు చివరకు ఏమిచేస్తారు అనేది ఉహించడం ప్రస్తుతానికి కొంచెం చాలా కష్టం అంటున్నారు. అయినా తొందరేముంది. ముందస్తు విషయంలోనూ ముఖ్యమంత్రి వెనకడుగు వేశారని విస్వసనీయంగా తెలుస్తున్నప్పుడు, ఇప్పటినుంచే ఎందుకు తొందరా .. చూడాల్సింది చాల్వుంది ..వేచి చూద్దాం అంటున్నారు. చూద్దాం.
మరోవంక సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వస్తున్న నేపధ్యంలో, ఆయన యాత్రను ఇతర జిల్లాలలో కొనసాగించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ‘పీపుల్స్ మార్చ్’ సెకండ్ ఫేజ్’కు సంబందించిన ప్రకటన ఉండవచ్చని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/political-heat-peaks-in-telangana-25-134458.html





