పోచారం ఆవేదన వెనుక అసలు రాజకీయం ఇదేనా..?
Publish Date:Aug 12, 2026
Advertisement
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్లో చేరడం పొరపాటేనా..? తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గులాబీ గూటికి గుడ్బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన, ఇప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి..? అసలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఏం జరుగుతోంది? అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో కండువా కప్పిన కీలక నాయకుల్లో పోచారం ఒకరు. కానీ, ఇప్పుడు ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, కానీ కొన్ని అనివార్య రాజకీయ పరిణామాల వల్లే కాంగ్రెస్లోకి రావలసి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించడం పెద్ద చర్చనీయాంశమైంది. అయితే, ఇక్కడే మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. తాను అసలు కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పుకోలేదని, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేసింది. డెవలప్మెంట్ నిధుల కోసం పార్టీ మారానని చెప్తూనే, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదనడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజలను అంత అమాయకులుగా భావిస్తున్నారా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలను కూడా పోచారం బహిర్గతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలను సొంత క్యాబినెట్ మంత్రులే అస్సలు లెక్క చేయడం లేదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పనుల కోసం మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయడం లేదని తన ఆవేదనను వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీలో పాత నాయకులకు, కొత్తగా వచ్చిన నాయకులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు పోచారం మాటల ద్వారా స్పష్టంగా బయటపడింది. అయితే, పోచారం మాత్రమే కాకుండా దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి వంటి మరికొందరు నాయకుల వైఖరిపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగిత్యాల ప్రాంతంలో దశాబ్దాలుగా జీవన్ రెడ్డి చెప్పిందే శాసనంగా ఉండేది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఎన్నో పదవులు అనుభవించిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చింది. కానీ, అక్కడ పరిస్థితులు మారాయి. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి కూడా కాషాయం కప్పుకుని మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ పార్టీ వ్యవహారాలపై విమర్శలు రావడం గమనార్హం. కేసీఆర్ గడీలోకి వెళ్లిన వారైనా లేదా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారైనా కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అసలైన నిబద్ధత కలిగిన నాయకులు ఎవరో, కేవలం ప్రయోజనాల కోసం వచ్చే వారెవరో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ సవాలును తట్టుకోవాలంటే హైకమాండ్ తక్షణమే స్పందించి ఈ ఆధిపత్య పోరుకు, అసమ్మతి వ్యాఖ్యలకు ముగింపు పలకాల్సి ఉంది. Pocharam Srinivas Reddy, CM Revanth Reddy Congress Party, Telangana Politics News, KCR BRS, Pocharam Comments, Telangana Congress News
అన్నం పెట్టిన నాయకుడిని మరవడం చాలా కష్టంగా ఉందంటూ పోచారం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వెనుక అర్థమేంటి? నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం వల్లే తాను పార్టీ మారానని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
http://www.teluguone.com/news/content/pocharam-srinivas-reddy-39-228697.html




