వ్యక్తిగత దూషణలు - ప్రజాస్వామ్య విలువల పతనం
Publish Date:Apr 16, 2026
Advertisement
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దులు దాటిపోయింది. విమర్శ, వ్యక్తిగత దూషణల మధ్య రేఖ చాలా పల్చగా మారుతోంది. ముఖ్యంగా స్టాండప్ కామెడీ, సోషల్ మీడియా వేదికలుగా పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర నాయకుల వ్యక్తిగత జీవితాలను విమర్శల పేరుతో కించపరచడం అనే ఒక ప్రమాదకరమైన ధోరణికి ప్రబలుతోంది. అనుదీప్ కటికల, రఫీక్ వంటి వ్యక్తులు కామెడీ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యలు కేవలం హాస్యం కోసం మాత్రమే కాకుండా, ఒక పథకం ప్రకారం జరుగుతున్న రాజకీయ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగు వన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు, అనుదీప్, రఫీక్ వంటి వారు స్టాండప్ కామెడీ ముసుగులో చేస్తున్న వికృత వ్యాఖ్యల వెనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉందన్నారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి నాయకుల ప్రజాదరణను నేరుగా ఎదుర్కోలేక, వారి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న వ్యూహంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ వ్యూహం తరచుగా దెబ్బతింటోంది. బూమరాంగ్ అవుతోంది. బాలయ్య, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు, అది వారి అభిమానులలో ఆవేశాన్ని పెంచడమే కాకుండా, సాధారణ ప్రజల్లో కూడా వారి పట్ల సానుభూతి ఏర్పడడానికే దోహద పడుతోంది. రాజకీయాల్లో విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప, కుటుంబ సభ్యులను లేదా వ్యక్తిగత విషయాలను లాగడం రాజకీయ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తుందని అడుసుమిల్లి అన్నారు. కమెడియన్ల అరెస్టులు, పోలీసు చర్యలు ఒకవైపు జరుగుతున్నా, ఈ విద్వేష ప్రసంగాలు ఆగడం లేదు. ఇది సమాజంలో అసహనాన్ని పెంచి, అభిమాన సంఘాల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావాలనే తపనతో చేసే ఇటువంటి వ్యాఖ్యలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. న్యాయస్థానాలు, పోలీసు యంత్రాంగం ఇటువంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించకపోతే, భవిష్యత్తులో రాజకీయ విమర్శలు పూర్తిగా అభ్యంతరకరమైన వ్యక్తిగత దూషణలుగా మారిపోయే ప్రమాదం ఉందంన్నారు అడుసుమిల్లి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి వివాదాలు ఓటర్ల నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ ఓటర్లు, మహిళా ఓటర్లు ఇటువంటి వ్యక్తిగత దాడులను అసహ్యించుకుంటారు. ఏ పార్టీ అయితే ఇటువంటి చర్యలను ప్రోత్సహిస్తుందో, ఆ పార్టీకి ప్రజల్లో ప్రతికూలత ఏర్పడుతుంది. భవిష్యత్తులో రాజకీయ పార్టీలు తమ సోషల్ మీడియా విభాగాలను, మద్దతుదారులను నియంత్రించకపోతే, రాజకీయ చర్చలు కేవలం విమర్శలకే పరిమితమై అభివృద్ధి అజెండా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. గౌరవప్రదమైన రాజకీయ వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అడుసుమిల్లి, వైసీపీయుల వ్యాఖ్యలకు ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతోందని చెప్పారు.
http://www.teluguone.com/news/content/personal-insults-in-politics-39-217510.html





