తెలంగాణ భవన్లో కేటీఆర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ కుస్తీ పోటీలు
Publish Date:Jul 24, 2026
Advertisement
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం 'కేటీఆర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్' పేరుతో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, జీవన్ రెడ్డి, తలసాని సాయికిరణ్ యాదవ్ తదితర నాయకులు, రాష్ట్రంలోని పలు అఖాడాలకు చెందిన రెజ్లర్లు, క్రీడాకారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా పుట్టినరోజు అంటే ప్రశాంతంగా గడపాలని అనుకున్నప్పటికీ, "మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం.. తెల్లారి లేస్తే పోరాటమే.. ఉదయం ధర్నా అయినా, సాయంత్రం కుస్తీ అయినా ఫైటింగ్ మోడ్లోనే ఉండాలి" అని తలసాని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని నవ్వుతూ పేర్కొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి కుస్తీతో ఎంతో అనుబంధం ఉందని, ఆయన తండ్రి కూడా ప్రముఖ పహిల్వాన్ అని గుర్తు చేశారు. అందుకే రెజ్లింగ్ క్రీడాకారుల అభివృద్ధిపై ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. రాష్ట్రంలోని సుమారు 70 అఖాడాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, హైదరాబాద్ నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యే సుమారు 150 మంది రెజ్లర్లకు షూలు, శిక్షణ, ఇతర ఖర్చులను భరించే బాధ్యతను తలసాని స్వయంగా తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేలా మౌలిక సదుపాయాలు, అభివృద్ధిపై విస్తృతంగా పనిచేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి అన్ని రకాల క్రీడలకు పెద్దపీట వేసేలా సమగ్ర విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తలసాని వంటి నాయకులు క్రీడాకారులకు అండగా ఉంటారని, తాను కూడా ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రెజ్లర్లకు ఎలాంటి అవసరం వచ్చినా బీఆర్ఎస్ నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన జన్మదినం సందర్భంగా తరలివచ్చిన కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని మల్లయుద్ధానికి మహాభారత కాలం నుంచే గొప్ప చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది సుమారు 150 మంది రెజ్లర్లు జాతీయ స్థాయికి ఎంపికవుతున్నారని తెలిపారు. వారికి అవసరమైన శిక్షణ, క్రీడా సామగ్రి, ఇతర సదుపాయాలన్నింటినీ అందించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని చెప్పారు. భవిష్యత్తులో కూడా రెజ్లింగ్ క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కుస్తీ పోటీలు తెలంగాణ భవన్లో ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రెజ్లర్లు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
http://www.teluguone.com/news/content/ktr-wrestling-championship-wrestling-competitions-36-227029.html




